సోదరుడి అరెస్ట్: అర్ధరాత్రి చేయి పట్టుకుంటే.. స్వాతిగౌడ్ ట్విస్ట్
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ను సస్పెండ్ చేసిన అధికారులు.. ఆ తర్వాత ఆమె సోదరుడిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ను సస్పెండ్ చేసిన అధికారులు.. ఆ తర్వాత ఆమె సోదరుడిని అరెస్ట్ చేశారు.
మూల్యం చెల్లించుకుంది!: ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ సస్పెండ్..
లారీ డ్రైవర్ను బెదిరించి ప్రయివేటు బౌన్సర్లతో దాడి చేయించిన ఏఎంవీఐ స్వాతి గౌడ్ అంశం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమె సోదరుడు సాయిప్రసాద్ను ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులు పరారీలో..
స్వాతి గౌడ్, మరో నిందితుడు సాయికిరణ్ పరారీలో ఉన్నారు. ఈ నెల 21న సాగర్ రింగ్ రోడ్డులో స్వాతిగౌడ్ ఓ లారీని ఆపి డబ్బుల విషయంలో వాగ్వాదంతో, యజమానిపై బౌన్సర్లతో దాడి చేయించారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇదీ స్వాతి గౌడ్ వాదన
ఇదిలా ఉండగా, స్వాతి గౌడ్ వాదన మాత్రం మరోలా ఉందని అంటున్నారు. తాను ఓ లారీని పట్టుకున్నానని, వారు తనపై దాడి చేయబోయారని, రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని చెప్పారని తెలుస్తోంది.
ఆఫ్టరాల్ ఆడదానివి అన్నారు..
నువ్వు ఆప్టరాల్ ఆడదానివి, మమ్మల్నేం చేస్తావని అన్నారని స్వాతిగౌడ్ ఆరోపిస్తున్నారు. లారీ డ్రైవర్ లైసెన్స్ తీయలేదని, లారీని సీజ్ చేయడానికి ప్రయత్నించానని చెప్పారు.
రాత్రి పూట ఆత్మరక్షణ కోసం..
రాత్రి పదకొండు గంటల సమయంలో తన చేయి పట్టుకుంటే ఏం చేయలేని పరిస్థితి అని, కాబట్టి ఆత్మరక్షణ కోసం తాను తన సోదరుడికి ఫోన్ చేసి పిలిపించుకున్నానని చెప్పారని తెలుస్తోంది. తనపై సస్పెన్షన్ వ్యవహారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.