TGSRTC: బస్టాండ్ లో జన్మించిన పాపకు జీవిత కాలం ఉచిత బస్ పాస్..
కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం వెల్లడించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ ఆడపిల్లకు బర్త్ డే గిప్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను మంజూరు చేస్తున్నట్లు వివరించింది.
గత ఆదివారం కరీంనగర్ బస్ స్టేషన్ లో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ఆర్టీసీ సిబ్బంది పురుడు పోసి మానవత్వాన్ని చాటుకున్నారు. దీంతో కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో మహిళకు పురుడు పోసిన సిబ్బందిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించారు. బుధవారం హైదరాబాద్ లోని బస్ భవన్ లో సంస్థ ఉన్నతాధికారులతో కలిసి వారిని ఘనంగా సత్కరించారు.

ఒడిశాకు చెందిన కుమారి-దూల దంపతులు పెద్దపల్లి జిల్లా కట్నపల్లిలో ఇటుకబట్టీలో పని చేస్తున్నారు. అయితే కుమారికి నెలలు నిండడంతో ఒడిశాకు వెళ్లాలని ఈ నెల 16న కరీంనగర్ బస్టాండ్ కు చేరుకున్నారు. అయితే కుమారికి నొప్పులు రావడంతో బస్టాండ్ ఎస్ఎం అంజయ్య గౌడ్ కు సమాచారం ఇచ్చారు. ఎస్ఎం అంజయ్య ఛాయి, వాటర్ బాటిల్ ఇచ్చి స్విపర్లను మహిళ వద్దకు పంపించారు. మరోవైపు 108కి సమాచారం ఇచ్చారు.
ఈ లోపు మహిళకు నొప్పులు ఎక్కువ గావడంతో ఆర్టీసీ సిబ్బంది చీరలు అడ్డు కట్టి మహిళకు ప్రసవం చేశారు. ఆ తర్వాత తల్లీ, బిడ్డలను 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమయస్పూర్తితో వ్యవహారించి.. సకాలంలో కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్య గౌడ్ ను వీసీ సజ్జనర్ అభినందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డితో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications