29నిమిషాల్లోపు వస్తేనే!: మెట్రో ఎక్కాలంటే ఇవి పాటించాల్సిందే.., వాటిపై నిషేధం!
సమయాన్ని మించి ఎవరైనా మెట్రో స్టేషన్ లో ఉంటే వారిపై చర్యలు తీసుకుంటారు.
హైదరాబాద్: నగరవాసులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో కల మొత్తానికి సాకారం కానుంది. ఈ నెల 28న మధ్యాహ్నాం 2.15గం.కు ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెట్రో ప్రారంభం కానుంది.
సామాన్య ప్రజలకు 29వ తేదీ ఉదయం 6గం. నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. రాత్రి 10గం. వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి. మున్ముందు సమయాన్ని మరింత పొడగిస్తామని మంత్రి కేటీఆర్ ఇదివరకే చెప్పారు.
మెట్రో ప్రారంభవేళ.. నిబంధనల గురించి కూడా అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు. వాటిని ఖాతరు చేస్తే, జరిమానా లేదా జైలు శిక్ష తప్పదంటున్నారు.
కింద కూర్చోవద్దు.. లగేజీ ఇంతే:
మెట్రో రైల్లోకి ఎక్కిన తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే కూర్చోవాలి. లేదంటే నిలబడాల్సిందే. అంతే తప్ప కింద కూర్చోవడానికి వీల్లేదు. ఎవరైనా కింద కూర్చుంటే వారికి జరిమానా తప్పదు.
ఇక లగేజీ విషయానికొస్తే.. ఒక్కో టికెట్ పై కేవలం 10కేజీల లగేజీని మాత్రమే అనుమతిస్తారు. ఆపై కేజీకి రూ.1 చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు. అది కూడా గరిష్టంగా 40కేజీల వరకే. ఆ పరిమితి దాటితే అసలు మెట్రో స్టేషన్ లోకే అనుమతించరు. అంతేకాదు, 40కేజీల లోపు ఉండే లగేజీ బ్యాగులు కూడా పొడవు 60సెం.మీ, వెడల్పు 45సెం.మీ, ఎత్తు 25సెం.మీ లోపే ఉండేలా చూసుకోవాలి.
షాక్: మెట్రోరైలులో ఇలా చేస్తే జైలుకే, మియాపూర్ టూ అమీర్పేటకు మోడీ, కెసిఆర్
2గం.కు మించి ఉండరాదు:
అసలే కొత్త మురిపెం.. చూడటానికి బాగుంది, చల్లగా ఉంది కదాని స్టేషన్ లోనే గంటల తరబడి ఉండిపోతామంటే కుదరదు. 2గం.కు మించి స్టేషన్ లోకి ఉండటానికి అనుమతించరు. మెట్రో మాల్స్ షాపింగ్ చేస్తున్నా సరే.. రెండు గంటలు దాటితే అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందే. లేదంటే జరిమానా తప్పదు.
20నిమిషాల్లోపు రాకుంటే!:
మెట్రో టికెట్ కొనుగోలు చేసిన తర్వాత 29నిమిషాల్లోపు కచ్చితంగా ఫ్లాట్ఫామ్పైకి చేరుకోవాలి. అంతేకానీ ఎప్పుడైనా వెళ్లొచ్చులే అని తాత్సారం చేస్తే కుదరదు. అరగంట తర్వాత వెళ్తే ఆ టికెట్ చెల్లుబాటు కాదు. మళ్లీ టికెట్ కొని ప్రయాణించాల్సిందే.
టోకెన్లు, స్మార్ట్ కార్డులు లేకపోయినా.. తీసుకున్న టోకెన్ సమయం ముగిసినా జరిమానా విధిస్తారు. దీనికోసం మెట్రో ప్రవేశం నుంచి అడుగుడగునా చెకింగ్ జరుగుతూనే ఉంటుంది. సీసీ కెమెరాల ద్వారా అందరి కదలికలను పర్యవేక్షిస్తుంటారు. ఎవరైనా గంటల తరబడి ఉన్నట్టు తెలిస్తే.. అక్కడినుంచి బయటకు పంపిస్తారు.
పబ్లిక్, ప్రైవేట్, ప్లాట్ ఫామ్:
ప్రతి మెట్రో స్టేషన్లో పబ్లిక్ ఏరియా, ప్రైవేట్ ఏరియా, ప్లాట్ఫామ్ పేరిట మూడు వేర్వేరు విభాగాలను ఏర్పాటు చేశారు. పబ్లిక్ ఏరియాలోకి ఎవరినైనా అనుమతిస్తారు. ప్రైవేటు ఏరియాలోకి మాత్రం టిక్కెట్ కొనుక్కుని వెళ్లాలి. అక్కడి నుంచి ప్లాట్ఫామ్పైకి వెళ్లొచ్చు. స్మార్ట్ కార్డు ఉన్నవారైనా సరే మెట్రో స్టేషన్ లో రెండు గంటలకు మించి ఉండరాదు.
ఇవి నిషేధం:
అగ్గిపెట్టెలు, లైటర్లు, గ్యాస్ సిలిండర్లు, కిరోసిన్, పెట్రోల్, చిన్న చిన్న కత్తులు, బ్లేడ్లు వంటివి మెట్రోలో నిషిద్ధం.
ప్రయాణికుల వద్ద ఉన్న టిక్కెట్ల సమయాన్ని, ఇతర సమాచారాన్ని తెలుసుకునేందుకు స్టేషన్లో రీడర్లను ఏర్పాటుచేశారు. టికెట్ను మిషన్పై ఉంచగానే మొత్తం సమాచారం తెలుసుకోవచ్చు. సమయాన్ని మించి ఎవరైనా మెట్రో స్టేషన్ లో ఉంటే వారిపై చర్యలు తీసుకుంటారు. మెట్రోస్టేషన్లో కీలకంగా వ్యవహరించే టికెట్ క్యాష్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ ఈ బాధ్యతలు చూసుకుంటారు.