Rythu Bandhu : రైతులకు అలర్ట్... దరఖాస్తుకు చివరి గడువు ఎప్పుడంటే... పూర్తి వివరాలివే...
తెలంగాణలో అర్హులైన రైతులు 'రైతు భీమా' పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 11వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ప్రకటించింది. ఈ ఏడాది అగస్టు 3వ తేదీ లోపు భూములను రిజిస్టర్ చేయించుకున్న రైతులు... 11వ తేదీ లోపు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచించింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు రూ.5లక్షలు భీమా ఉంటుంది. ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యం కారణంగా రైతు మరణిస్తే ఆ మొత్తం నామినీకి అందజేస్తారు.కాబట్టి అర్హులైన రైతులంతా దీనిని సద్వినియోగం చేసుకోవాలని వ్యావసాయ శాఖ అధికారులు కోరారు.
రైతు భీమా నియమ నిబంధనలు
రైతులు తమ భూమి 03.08.2021 లోపు రిజిస్టర్ చేసుకొని ఉండాలి.
రైతుల వయసు 18-59 సంవత్సరాలు ఉండాలి. అంటే 14.08.1962 నుండి 14.08.2003 మధ్య జన్మించి ఉండాలి.
ఆధార్ కార్డుపై ఉన్న వయసునే పరిగణలోకి తీసుకుంటారు.
ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒక ఊరిలో మాత్రమే బీమాకు అవకాశం ఉంటుంది.
రైతే స్వయంగా వచ్చి నామినేషన్ ఫారం మీద సంతకం చేసి భూమి పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ AEO కు అందజేయాలి.
ఇప్పుడు మీరు బీమా చేసుకోకపోతే ఇంకో సంవత్సరం వరకు బీమా చేసుకోవడానికి అవకాశం ఉండదు.

తెలంగాణ ప్రభుత్వం రైతు భీమా పథకాన్ని అగస్టు 15,2018న ప్రారంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత భీమా పథకంగా దీన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం రికార్డుల్లో ఉన్న అర్హుడైన రైతు ఏ కారణం చేత మరణించినా 10 రోజుల్లో అతని కుటుంబానికి రూ.5లక్షలు అందుతాయి.
మరణించిన రైతు వివరాలతో కూడిన సమాచారాన్ని వ్యవసాయ అధికారులకు అందించే బాధ్యత రైతు సమన్వయ సభ్యులు, సమన్వయ కర్తలపై ఉంటుంది. మరణ ధృవీకరణ పత్రాన్ని వ్యవసాయాధికారికి 48 గంటల లోపు గ్రామా కార్యదర్శి అందజేయాల్సి ఉంటుంది. స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి (ఎఈవో) మరణించిన రైతు నివాసానికి వెళ్లి సేకరించిన సమాచారాన్ని వెంటనే జిల్లా వ్యవసాయ అధికారికి (డీఈవో) అందించాల్సి ఉంటుంది. అక్కడ పరిశీలన అనంతరం ఎల్ఐసీ అధికారులకు దాన్ని పంపిస్తారు. రైతు భీమా పథకం అమలుకు ఎక్కడికక్కడ ప్రత్యేక విభాగాలను ఎల్ఐసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా నిర్ణీత సమయంలో భీమా చెక్కులు అర్హులకు అందుతున్నాయి. ఈ ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా అమలయ్యేలా వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. వారికి పంచాయితీ రాజ్ శాఖ సహకరించాల్సి ఉంటుంది.
ఈ పథకం ప్రారంభించిన మొదటి ఏడాది దాదాపు రూ.636 కోట్ల రూపాయలతో 28 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా దీన్ని రూపొందించారు.గత ఆర్థిక సంవత్సరం రూ.1173.54 కోట్లు రైతు భీమా పథకం కోసం వెచ్చించారు. దీని ద్వారా 32.73 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరింది. రెండేళ్లలో ఈ పథకం ద్వారా 32,267 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందింది. రైతు భీమాతో పాటు రైతు బంధు పథకం ద్వారా తెలంగాణలో లక్షలాది రైతు కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి. ఈ పథకాలను స్పూర్తిగా తీసుకొని ఇతర రాష్ట్రాలు కూడా వీటిని అమలుచేస్తుండటం విశేషం.












Click it and Unblock the Notifications