సాధువు..!! తెలుగు రాజకీయాలను శాసించగలడా..? పరిపూర్ణ పస ఎంత..?
హైదరాబాద్: రాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్రకు పూనుకోవడంతో పోలీసులు అడ్డుకున్న సంఘటనతో రాజకీయంగా పరిపూర్ణానంద సంచలంనంగా మారారు. అంతే కాకుండా 2017నాటి స్వామి ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనను తెలంగాణ పోలీసులు 6 నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ చేశారు. ఈ వివాదం వల్లే స్వామి పరిపూర్ణానంద మరింత ప్రాచుర్యం పొందారు. దీంతో రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాల ద్రుష్టిని ఆయన ఆకర్శంచగలిగారు. దాంతో భారతీయ జనతా పార్టీ ఆయనను దగ్గరకు తీసుకుని దక్షిణ భారత దేశంలో ఓ ట్రంప్ కార్డులా ఉపయోగించుకునేందుకు బ్రుహత్కర ప్రణాళిక రచించింది.
పరిపూర్ణానంద రాజకీయాల్లో రాణిస్తారా..! యోగీ ఆదిత్యానాథ్ తో పోల్చడం సమంజసమేనా..?
తెలుగు రాష్ట్రాల్లో నిత్యం సంచలనాత్మక వార్తల్లో ఉండే స్వామి పరిపూర్ణానంద ఢిల్లీలో బీజేపీలో చేరారు. తెలంగాణలో ఈ పరిణామం అనూహ్య రాజకీయ సమీకరణాలకు తెరలేవనున్నట్టు బీజేపీ చెబుతూ వస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ స్వామికి వేలాది మంది అనుచర గణం ఉన్న నేపథ్యంలో ఆయన రాజకీయంగా ప్రభావం చూపుతారని బీజేపీ విశ్వసిస్తోంది. అయితే కొన్ని ప్రసార సాధనాలు ఆయనను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పోల్చుతూ వచ్చాయి. కానీ యోగి ఆదిత్యనాథ్ చాలా సీనియర్ రాజకీయ నేత. యోగి ఆదిత్యనాథ్ 26 ఏళ్లకే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలిచారు. యూపీలో హిందుత్వకు ఒక పెద్ద ముఖచిత్రం ఆయన. యోగీతో పరిపూర్ణను పోల్చడం సాహసోపేతమే అవుతుంది.
ఏపీ టూ రిషికేష్.. రిషికేష్ టూ తెలంగాణ.. తెలంగాణ టూ బీజేపి..! ఇదీ ప్రస్థానం..!!
1972లో నెల్లూరులో జన్మించిన స్వామి పరిపూర్ణానంద వేద పాఠశాలలో విద్యను అభ్యసించి 16వ ఏటా రిషికేష్ వెళ్లిపోయారు. అక్కడ దయానంద సరస్వతి స్వామి వద్ద వేదాధ్యయనం చేశారు. 1999లో కాకినాడలో శ్రీపీఠం స్థాపించారు. 2003, 2004లో గోదావరి, కృష్ణా పుష్కరాల్లో భక్తులకు అన్నదానం చేశారు. క్రమంగా వివిధ ప్రసార మాధ్యమాలు, సభల్లో ప్రవచనాలు చేస్తూ వచ్చారు. దేశంలో హైందవ ధర్మంపై దాడులు జరుగుతున్నాయని భావించి హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన వివిధ చర్చల్లో పాల్గొన్నారు.
పరిపూర్ణ ద్వారా ధర్మ పరిరక్షణ జరుగుతుందా..? బీజేపి నమ్మకాన్ని నిలబెడతారా..?
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో స్వామి పరిపూర్ణానంద ప్రభావం చూపిస్తారని, దక్షిణాదిన చక్రం తిప్పి బీజేపీకి ప్రాణం పోస్తారని స్వామీజీదిగా భావిస్తున్న ఓ టీవీ ఛానెల్ వార్తలు ప్రసారం చేస్తోంది. అయితే స్వామి ప్రభావం ఎలా ఉండబోతోంది? మరో యోగి ఆదిత్యనాథ్ గా ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతారా? ఈ ప్రశ్నలకు జవాబు కోసం మరికొంత కాలం ఎదురుచూడకతప్పదు. ఒకటి మాత్రం నిజం. గడిచిన 20 ఏళ్లుగా తెలంగాణ బీజేపీలో ఉన్న నలుగురు సీనియర్ నేతలు పార్టీ ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం చూపలేదని, పరిపూర్ణానంద రాకతో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని, బీజేపీ అభిమానులు, హిందూ ధర్మ పరిరక్షకుల్లో విశ్వాసం ఏర్పడింది.
ఫైర్ ఉన్న పరిపూర్ణ..! రైట్ పర్సన్ ని ఎంపిక చేసిన అమీత్ షా..!!
స్వామిజీ బీజేపీలో చేరుతూ తనకు వెనకా ముందు ఎవరూ లేరని, సాధువునైన తాను 24 గంటలూ పార్టీ అభ్యున్నతికి పాటుపడతానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దేశంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనసావాచా చిత్తశుద్ధితో పనిచేసిన తాను ఇక రాజకీయాల్లోనూ, బీజేపీకి వెలుగులు పంచడంలోనూ అలాగే పనిచేస్తానని వాగ్దానం చేశారు. ఈలెక్కన బీజేపీకి ఒక కరడుగట్టిన నేత లభించినట్టేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జంట నగరాలతోపాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో స్వామి పరిపూర్ణానంద అనేక భక్తి కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారని, అక్కడ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని చర్చ జరుగుతోంది.