అరుణతో విభేదాలా? అబాసుపాలుకావొద్దు: హరీశ్కు ఎమ్మెల్యే సంపత్ కౌంటర్
హైదరాబాద్: రాజకీయంగా ఎదుర్కోలేకే పార్టీ మారుతున్నానంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ విప్, ఎమ్మెల్యే సంపత్కుమార్ మండిపడ్డారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లో హుందాగా ఉండాలనే ఉద్దేశంతో నియోజకవర్గానికి వచ్చిన మంత్రి హరీశ్రావును కలిసి గౌరవించానని, అపరిష్కృత పనులనూ ప్రస్తావించానని చెప్పారు.
నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు వాస్తవాలు మరిచి తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ అన్నారు.

దద్దమ్మలంటూ పక్కన కూర్చుబెట్టుకుంటారా?
ఆర్టీఎస్కు శాశ్వత పరిష్కారానికి అనాడు కాంగ్రెస్ తుమ్మిళ్ల రిజర్వాయర్ ఎంచుకున్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలను చవటలు, దద్దమ్మలు అంటున్న హరీష్రావు....ఇప్పుడు వారిని తన పక్కన కూర్చోపెట్టుకున్నారనే సంగతి మరిచారని సంపత్ కుమార్ ఎద్దేవా చేశారు.

హరీశ్ అబాసుపాలు కావొద్దు
రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు దండం పెట్టిన సంగతిని చెప్పిన హరీశ్.. తాను అడిగిన నియోజకవర్గం పెండింగ్ పనులను ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మంత్రి హరీశ్రావు చెప్పుడు మాటలు విని అబాసుపాలు కావద్దని సూచించారు.

డీకే విభేదాల్లేవ్
తాను పార్టీ వీడనని తమ అధ్యక్షుడికి తెలుసునని... టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లనని హరీశ్, కేటీఆర్కూ తెలుసునని సంపత్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి డీకే అరుణ తనకు మాతృ సమానురాలని... అమె వల్లనే తాను ఎమ్మెల్యేనయ్యానని చెప్పారు. డీకే అరుణతో తనకెలాంటి విభేదాలు లేవని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

రేవంత్ విమర్శలు
మంగళవారం గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా ముసుగులో దివాలా తీసిన కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని రాష్ట్రప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ సర్కారు చేస్తున్న మధ్యకాలిక ఒప్పందాలలో అవినీతి దాగుందని రేవంత్ అన్నారు. కొనుగోళ్లు లేక మూతపడిన కంపెనీల నుంచి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలుకు అవకాశమున్నా ప్రభుత్వం ఎక్కువ ధరకు కొంటోందన్నారు. 2016-17లో ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని, విద్యుత్ కొనకపోయినా రూ.957 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను బయటపెట్టాలని, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications