మరో కీలక మలుపు: ఓటుకు నోటు కేసులో సండ్ర అరెస్ట్: కారణాలివే
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అరెస్టు చేసింది. ఓటుకు నోటు కేసులో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది? అనే కోణంలో ప్రధానంగా ఏసీబీ ఆరా తీసిందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో ఎక్కువసార్లు టచ్లో ఉంది సండ్రనే అని ఏసీబీ చెబుతోంది.
ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు సండ్ర ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. సుదీర్ఘంగా విచారించి సాయంత్రం అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సండ్ర చాలామందిని ప్రభావితం చేసే ప్రయత్నం చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పలువురు ఎమ్మెల్యేలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేశారని భావిస్తోంది.
ఆయనను ఏడు గంటల పాటు విచారించారు. ఓటుకు నోటు కేసులో చాలామంది ఎమ్మెల్యేలతో ఆయన సంప్రదింపులు జరిపినట్లుగా ఏసీబీ గుర్తించిందని తెలుస్తోంది. సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలతో టచ్లో ఉన్నారు. సండ్రకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు.
అంతకుముందు..
సండ్ర వెంకట వీరయ్య సోమవారం ఉదయం ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఆయనను ఏడెనిమిది గంటలుగా ఏసీబీ విచారిస్తోంది. విచారణకు ఇవాల్టితో గడువు ముగియనుండటంతో ఇక అరెస్టు తప్పదని భావించిన సండ్ర ఏసీబీ కార్యాలయానికి విచారణ కోసం నేడు హాజరయ్యారు.
సండ్రను ఉదయం నుంచి ఏసీబీ పోలీసులు విచారిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో కీలక అంశాలను ఆయననుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో డబ్బులు ఎక్కన్నుంచి వాచ్చాయనే కోణంలో విచారణ సాగుతోందని తెలుస్తోంది.
సండ్రపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సండ్రతో పాటు మరో నిందితుడు జిమ్మీకి కూడా ఈ సాయంత్రంతో గడువు ముగియనుంది. 5 గంటలలోపు ఏసీబీ ఎదుట హాజరుకాకపోతే అరెస్టు వారెంటు జారీ చేసే అవకాశముంది.