రోహిత్ ఆత్మహత్య-బిజెపికి మిత్రపక్షం షాక్: స్మృతి, దత్తాత్రేయల వల్లేనని.. పాశ్వాన్
హైదరాబాద్/ఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన పైన మిత్ర పక్షం నుంచి బిజెపికి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి సంజయ్ పాశ్వాన్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ ఆత్మహత్య ఘటనను బిజెపిని ఇబ్బందుల్లోకి నెట్టేలా ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ వ్యవహరించిన తీరే వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమని సంజయ్ పాశ్వాన్ ఆరోపించారు. ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. హెచ్సీయూ ఉపకులపతిని తప్పించాలన్నారు.
స్మృతి ఇరానీకి రాసిన లేఖలో బండారు దత్తాత్రేయ... వేముల రోహిత్ను జాతి వ్యతిరేకి అని పేర్కొన్నారన్నారు. స్మృతి ఇరానీ కూడా విద్యార్థి వ్యవహారంలో సరిగ్గా వ్యవహరించలేదన్నారు. రోహిత్ బలవన్మరణానికి వారిరువురూ బాధ్యత వహించాలన్నారు. ఉగ్రవాదులకు అనుకూలంగా వారు నిరసన వ్యక్తం చేసినట్లుగా చెబుతున్న విషయం తెలిసిందే.

వేముల రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో విపక్షాలపై బిజెపి ఎదురుదాడికి దిగుతోంది. విద్వేష భారత్ ప్రచారంలో ఏఎస్ఏ భాగమని ఆరోపించింది. బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సామాజిక మాధ్యమంలో పలు అంశాలపై తమ అభిప్రాయాలను గురువారం వెల్లడించారు.
హైదరాబాద్లో ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని రాజకీయ లబ్ధికోసం రోహిత్ ఆత్మహత్యపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. కొన్ని సంస్థలు భారత్ను నిర్వీర్యం చేసే ప్రయత్నాల్లో భాగంగా గోమాంసం విందులు నిర్వహించడం, యాకూబ్ మెమన్ మరణానికి నివాళిగా ప్రార్థనలు నిర్వహించడం, ఉగ్రవాదానికి మద్దతివ్వడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాయన్నారు.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తిరువనంతపురంలో మాట్లాడుతూ... విశ్వవిద్యాలయం దేవాలయంలాంటిదని, దేవాలయానికి వెళ్లినప్పుడు చెప్పులను బయట విడిచినట్లే విశ్వవిద్యాలయానికి వెళ్లినప్పుడు రాజకీయాలనే చెప్పులను నాయకులు బయటే విడిచిపెట్టాలని, హెచ్సీయూకు వెళ్లినప్పుడు సంతాపం ప్రకటించాలని, అంతేతప్ప రాజకీయ ప్రసంగాలు చేస్తూ పరిస్థితులను మరింత దిగజార్చవద్దన్నారు.












Click it and Unblock the Notifications