నయీంకు సామంతరాజులా సంజీవ రెడ్డి, పోలీసుల అదుపులో టీవీ ఛానల్ ప్రతినిధి
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. వనస్థలిపురంలోని నయీం అనుచరుడు సంజీవ రెడ్డి ఇంటిని ఆదివారం నాడు పోలీసులు చుట్టుముట్టారు. పోలీసులు వచ్చిన విషయం తెలిసి అతను పరారయ్యాడు. దర్యాఫ్తు అధికారులు ఆయన కుటుంబాన్ని విచారించారు.
తుక్కుగూడలో నయీం అనుచరులు భూములు ఆక్రమించి సంజీవరెడ్డి అనుచరుడి పేరుతో ఫంక్షన్ హాలు నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఆదిభట్లలో భూములు బలవంతంగా లాక్కున్నారు. పలు కబ్జాల్లో సంజీవరెడ్డి కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. ఓ విధంగా ఇతను నయీంకు సామంతరాజులాగా వ్యవహరించారని అంటున్నారు.
నయీం ఆస్తులకు సంబంధించి సంజీవ రెడ్డి బినామీగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు విశ్వసిస్తున్నారు. ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లోని భూముల్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆధారాలు లభించడంతో అతడి కోసం వేట ప్రారంభించారు.
సంజీవ రెడ్డి దశాబ్దకాలానికి పైగా నయీంతో సంబంధాలు నెరుపుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నగర శివార్లలో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకోవడంతో నయీంతో సంజీవరెడ్డి అనుబంధం బలపడింది. ఆదిభట్ల, కొంగరకలాన్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలతో ఇతడికి ఉన్న సంబంధాల దృష్ట్యా నయీం ఇతడిని బినామీగా ఏర్పాటు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు.
సుమారు 60 ఎకరాలను ఈ ముఠా దౌర్జన్యంగా ఆక్రమించినట్లు అనుమానిస్తున్నారు. కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో భూములకు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించేవారు. ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని ఉన్న విలువైన భూముల్లో ఎనిమిది ఎకరాలకు తప్పుడు పత్రాలు సృష్టించి హస్తగతం చేసుకున్నారని తెలుస్తోంది.
ఆదిభట్లలో 22 ఎకరాలను స్వాధీనం చేసుకొని నయీం సోదరి పేరిట సగం భూమిని రిజిస్ట్రేషన్ చేయించారని తెలుస్తోంది. ఆ తర్వాత అదే స్థలాన్ని కొంత కాలం క్రితం మరో మహిళకు విక్రయించారు. ఈ స్థలం ఎకరా సుమారు రూ.4 కోట్లుండడంతో భారీ మొత్తంలోనే వెనకేసుకున్నారు. ఆరు నెలల క్రితం అనుచరుడి పేరిట నిర్మించిన ఫంక్షన్ హాలులో నయీం విందుకు తన అనుచరులతో కలిసి హాజరైనట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, నయాం అనుచరుడు, నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఛానెల్ ప్రతినిధిని సిట్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకొని విచారించినట్లుగా వార్తలు వస్తున్నాయి. జిల్లా కేంద్రం నుంచి నయీంతో నేరుగా మాట్లాడిన వారిలో ఈయన ముఖ్య వ్యక్తిగా అనుమానిస్తున్నారు.