కేసీఆర్ చెప్పింది నిజమే: హుజూర్నగర్ గెలుపుపై మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్: హుజూర్నగర్ ఉపఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రతిపక్షాలకు చెంప పెట్టు లాంటిదని తెలంగాణ గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలు చేసిన దుష్ర్పచారాన్ని తిప్పి కొట్టే విధంగా.. వారిని ఓడించాలన్న కసితో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు.
కేసీఆర్కు పాదాభివందనం
తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షులు, ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామాత్యులు కేటీఆర్ నాయకత్వంలో సోమవారం జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల ఆత్మీయ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల ఘన విజయంలో తనను భాగస్వామ్యం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు పాదాభివందనమని , మంత్రి కేటీఆర్కి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
అప్పుడే ఆ విషయం తెలిసింది..
ఈ గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి కార్యకర్త, నాయకులందరికీ అభినందనలు తెలిపారు. ఉప ఎన్నికల సందర్భంగా హుజూర్నగర్ తండాలలో క్షేత్ర స్థాయిలో తిరిగినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటేస్తారన్న విషయం తెలిసిందన్నారు.
కేసీఆర్ చెప్పింది నిజమేనని..
సీఎం కేసీఆర్ కూడా మన పనులను చూసి ఓటేస్తారని చెప్పిన విషయం నూటికి నూరుపాళ్లు నిజమని ఈ తీర్పుతో తేలిందన్నారు. ప్రతి ఒక్కరు కేసిఆర్ గారికి ఓటేస్తామని డిసైడ్ అయి ఓట్లేశారని, ప్రతిపక్షాలను ఓడించాలన్న కసితో ఓట్లేశారని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. కాగా, హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి ఓటమిపాలయ్యారు.