కాళ్లు చేతులు కట్టేసి బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ హత్య
హైదరాబాద్: ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. నోటికి గుడ్డ కట్టి, కాళ్లు, చేతులను కట్టేసి తలపై బండరాయితో మోదీ చంపేశారు. చంపాపేట ఈస్ట్ మారుతీనగర్లో నివసించే బ్రిజ్ మనోహర్ (53) ఓల్డ్ మలక్పేటలోని ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్ (అకౌంట్స్)గా పని చేస్తున్నారు.
శనివారం బ్యాంకుకు వెళ్లిన మనోహర్ రాత్రి వరకు తిరిగి రాలేదు. ఫోన్ కూడా పనిచేయకపోవడంతో తన భర్త కిడ్నాప్నకు గురైనట్లు ఆయన భార్య అనిత ఛాదర్ఘాట్ పోలీసులకు ఆదివారం ఉదయం ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఒమర్ దర్గా వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది.

నోటికి ప్లాస్టర్ వేసి కాళ్లు, చేతులను మెడికల్ పట్టీలతో కట్టేసి ఉన్న మృతదేహాన్ని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తులో మృత దేహం మనోహర్దిగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్, హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
నిజామాబాద్లో బ్యాంక్ మేనేజర్ అనుమానాస్పద మృతి
నిజామాబాద్: నిజామాబాద్ నగరం కోటగల్లిలో దక్కన్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్రెడ్డి (56) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మెదక్లో పనిచేస్తూ ఎన్జీవోస్ కాలనీలో భార్యాబిడ్డలతో నివాసం ఉండే రాజశేఖర్రెడ్డి తల్లి సుశీల కోటగల్లిలో నివాసం ఉంటుంది. వారానికి ఒకటి, రెండుసార్లు అతను తల్లిదగ్గరకు వచ్చి, అక్కడే పడుకొని మరుసటి రోజు వెళ్తుండేవాడు.
సుశీల గంగాస్థాన్లో తన రెండో కుమారుడి వద్ద ఉంది. రాజశేఖర్రెడ్డి శనివారం రాత్రి తన తల్లి ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు పదిన్నర గంటల సమయంలో బెడ్రూమ్ కిటికీ తెరిచి చూడగా రాజశేఖర్రెడ్డి చనిపోయి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి డాగ్స్వ్కాడ్, క్లూస్ టీమ్లతో తనిఖీలు నిర్వహించారు. మృతుడి భార్య సరోజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టౌన్ సీఐ యాదయ్య తెలిపారు.












Click it and Unblock the Notifications