భూ కొనుగోలు వివాదం: బండ్ల గణేష్పై ఎస్సీ, ఎస్టీ కేసు
షాద్నగర్: సినీ నిర్మాత బండ్ల గణేష్పై, ఆయన సోదరుడు శివబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సురేందర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన డాక్టర్ దిలీప్చంద్రకు ఫరూఖ్నగర్ మండలం బూర్గుల శివారులో భూములు, పౌల్ట్రీలు ఉన్నాయి.
వాటిని బండ్ల గణేశ్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఆస్తులపై ఉన్న బ్యాంకు రుణాలను చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఒప్పందంలో భాగం. సరైన సమయంలో రుణాలు చెల్లించనందున బ్యాంకు అధికారులు ఆ భూములను,డాక్టర్ దిలీప్చంద్ర ఇంటిని సీజ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు.
ఆ తర్వాత ఆ భూములను వారి ద్వారానే విక్రయించారని చెప్పారు. తమకు రావాల్సిన డబ్బుల కోసం డాక్టర్ దిలీప్చంద్ర తన సతీమణి, కౌన్సిలర్ కృష్ణవేణితో కలిసి బూర్గుల శివారులో గల గణేష్ పౌల్ట్రీ ఫారం కార్యాలయానికి వెళ్లారు.
తమను గణేష్, శివబాబు దూషించారని కౌన్సిలర్ కృష్ణవేణి ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు గణేశ్ సోదరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఏసీపీ తెలిపారు.