బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
హైదరాబాద్: ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సుధీర్ రెడ్డి తనను కులం పేరుతో దూషించారని హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం డీసీపీ ఆఫీసు వద్ద ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేటర్లపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో చిన్నగా మొదలైన ప్రోటోకాల్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా.. అవే పనులకు బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి సోమవారం మళ్లీ శంకుస్థాపన చేశారు. దీంతో వివాదం మొదలైంది.

ఎమ్మెల్యే శంకుస్థాపన చేశాక మళ్లీ ఎలా చేస్తారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతిపజేశారు. ఆ తర్వాత మరో చోట శంకుస్థాపనలు జరగ్గా.. బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. పీఎస్కు చేరుకుని వారిని విడిపించారు.
అరెస్ట్ సమయంలో కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలిసి.. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత డీసీపీ ఆఫీసుకు తీసుకెళ్లి ఉన్నతాధికారులకు జరిగిన విషయం గురించి తెలిపారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ దాడుల వెనుక కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ప్రమేయం ఉందని, కార్పొరేటర్ల మధ్య హనీమూన్ నడుస్తోందని ఆరోపించారు.
ఈ క్రమంలో హస్తినాపురం కార్పొరేటర్ సుజాత పేరును కూడా ఆయన ప్రస్తావించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై సుజాత్ తీవ్రంగా మండిపడ్డారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సుజాత్ నాయక్ కు మద్దతుగా పలువురు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కార్పొరేటర్ సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయా సెక్షన్ల కింద సుధీర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications