బిజెపి కొలికి: గందరగోళంలో టిడిపితో సీట్ల సర్దుబాటు
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం మధ్య సీట్ల సర్దుబాటు గందరగోళంలో పడింది. సీట్ల కేటాయింపు విషయంలో బిజెపి కొలికి పెట్టింది. ఎన్నెన్ని డివిజన్లకు పోటీ చేయాలనే విషయంపై ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరినప్పటికీ సీట్ల కేటాయింపులో మార్పులు చేయాలని బిజెపి టిడిపిని కోరింది.
టిడిపి నుంచి సమాధానం వచ్చిన తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయాలని బిజెపి తెలంగాణ నాయకత్వం భావిస్తోంది, కాగా, రేపు ఆదివారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. దీంతో ఆఘమేఘాల మధ్య ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఏర్పడింది.
బిజెపి 60 స్థానాలకు, టిడిపి 90 స్థానాలకు పోటీ చేయడానికి ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. దీంతో అభ్యర్థుల ఎంపిక కోసం బిజెపి నాయకులు శనివారం ఉదయం నుంచి కసరత్తు ప్రారంభించారు. అయితే, అకస్మాత్తుగా సీట్ల కేటాయింపులో మార్పులు చేయాలని అడుగుతున్నారు. కాగా, అభ్యర్థుల ఖరారుకు తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశమయ్యారు.
కేంద్ర మంత్రి సుజనా చౌదరి నివాసంలో వారు సమావేశమైనట్లు తెలుస్తోంది. శనివారం టిడిపి తన అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తెరాస 80 డివిజన్లకు రెండు విడతలుగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించింది. కాంగ్రెసు రెండో జాబితా విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది.