ఈటల టార్గెట్ గా రెండోరోజు జమునా హేచరీస్ భూముల రీ సర్వే: అక్కడ టీఆర్ఎస్ నాయకులకు ఏం పని; బీజేపీ ఫైర్
మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు సంబంధించిన జమున హేచరీస్ భూముల రీ సర్వే రెండో రోజు కొనసాగుతోంది. ఈటల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ జమున హెచరీస్ భూములపై భూ కబ్జా వ్యవహారంలో రంగంలోకి దిగిన తెలంగాణ సర్కార్ తీరుపై ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఇక జమునా హేచరీస్ భూముల రీ సర్వే స్థలానికి సమీపంలో టీఆర్ఎస్ నాయకులు ఉండటం రాజకీయ దుమారంగా మారుతుంది.
జమునా హేచరీస్ కబ్జా ఆరోపణలు .. గతంలోనే సర్వే
మెదక్ జిల్లా మూసాయి పేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాలలో దళితులు పేదలకు సంబంధించిన అసైన్డ్ భూములను ఈటెల రాజేందర్ కబ్జా చేశారని కొందరు రైతులు సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేయడంతో ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్న సమయంలోనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు. ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో జమున హేచరీస్ భూములపై ప్రాథమికంగా సర్వే నిర్వహించారు. 66.01 ఎకరాలు అసైన్డ్ సీలింగ్ పట్టా భూములు జమున హేచరీస్ ఆధీనంలో ఉన్నట్లుగా జిల్లా కలెక్టర్ అప్పుడే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
న్యాయ పోరాటానికి దిగిన ఈటల రాజేందర్ ... రీ సర్వే చెయ్యమన్న కోర్టు
ఆ తర్వాత ఈటల రాజేందర్ న్యాయపోరాటానికి దిగడం, అధికారులు సరిగా సర్వే చేయలేదని కోర్టును ఆశ్రయించడంతో జమున హేచరీస్ భూములపై రీ సర్వే చేయాల్సిందిగా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పట్లోనే జమునా హేచరీస్ భూముల రీ సర్వే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసి నవంబరు 16వ తేదీ నుండి భూ సర్వే నిర్వహిస్తున్నారు.
ఈటల రాజేందర్ భూముల్లో రెండో రోజు రీ సర్వే... సర్వే ఇలా
రెండోరోజు ఈటల రాజేందర్ భూములలో జరుగుతున్న రీ సర్వే అచ్చంపేట లోని 77, 78, 79, 80, 81, 82 సర్వే నెంబర్లలో నిర్వహిస్తున్నారు. నవంబరు 16వ తేదీన మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేటలో సర్వేనెంబర్ 130 లో 18.35 ఎకరాల భూమికి సంబంధించిన సర్వే పూర్తి చేశారు అధికారులు. సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేసిన రైతులు, జమున హేచరీస్ కు సంబంధించిన ఇద్దరు సభ్యులు, 20 మంది స్థానికులు సమక్షంలో సర్వే నిర్వహిస్తున్నారు. ఆర్డీవో శ్యాంప్రసాద్, సంబంధిత మండలాల రెవెన్యూ అధికారులు భూ సర్వే ను పర్యవేక్షిస్తున్నారు. సర్వే నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. నవంబర్ 18వ తేదీన ప్రభుత్వానికి సర్వేకు సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించనున్నట్లు గా అధికారులు చెబుతున్నారు.
జమునా హేచరీస్ వద్ద టీఆర్ఎస్ నాయకులకు ఏం పని? బీజేపీ ఫైర్
ఇదిలా ఉంటే జమున హేచరీస్ భూముల సర్వే వద్ద టీఆర్ఎస్ నాయకులు ఉన్నారంటూ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమిని జీర్ణించుకోలేని సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ ను టార్గెట్ చేశారని మండిపడుతున్నారు. టిఆర్ఎస్ నాయకులు జమున హేచరీస్ వద్ద ఏం పని అంటూ ప్రశ్నిస్తున్నారు. సర్వే చుట్టుపక్కల ప్రాంతాలలో వారు ఎందుకు తిష్ట వేశారని మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు రైతులను మభ్యపెడుతున్నారని, మద్యం ,బిర్యానీలు పంచుతూ రైతులను ప్రలోభపెట్టి ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది టీఆర్ఎస్ కుట్రగా అభివర్ణిస్తున్నారు. కానీ అధికారులు ఈటల రాజేందర్ హైకోర్టుకు వెళ్ళటంతో హైకోర్టు ఆదేశాల మేరకే జమునా హేచరీస్ భూముల రీ సర్వే చేస్తున్నామని చెప్తున్నారు.