ఢిల్లీ తరహా తెలంగాణ కొత్త సచివాలయం, వాస్తు దోషం: ఇంటి నుంచే..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయ నిర్మాణ నమూనాకు త్వరలో ఓ రూపు తీసుకు రానున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త సచివాలయాన్ని ఢిల్లీలోని నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ తరహాలో నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
నమూనా సిద్ధమైనప్పటికీ అది ఏ స్థాయిలో ఉండాలన్నది స్పష్టత రావాల్సి ఉంది. రెండు రకాల ప్రతిపాదనలతో అధికారులు దస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. సీఎం కార్యాలయం ఉన్న భవనం తొమ్మిది అంతస్తుల్లో ఉంటే మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలున్నది అయిదు అంతస్తుల్లో ఉండాలన్నది తొలి ప్రతిపాదన.
ముఖ్యమంత్రి కార్యాలయం ఏడు అంతస్తుల్లో ఉంటే ఇతర నిర్మాణాలను నాలుగు అంతస్తులకు పరిమితం చేయాలన్నది మరో ప్రతిపాదన. ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలో పది అంతస్తుల ఎత్తు వరకు నిర్మాణాలు చేపట్టేందుకు పౌర విమానయన శాఖ నుంచి అభ్యంతరాలు ఉండవని నిర్ధారించుకున్నారు.
అయితే, తొమ్మిది అంతస్తులకు మించి నిర్మాణం ఉండవద్దన్నది ప్రభుత్వం యోచనగా తెలుస్తోంది. సచివాలయ నిర్మాణం కోసం వివిధ ప్రాంతాలను పరిశీలించారు. అన్నింటిని పరిశీలించాక ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సచివాలయానికి వాస్తు దోషం ఉందని చెబుతున్నారు. దానిని కొత్త నిర్మాణంలో చక్క దిద్దాలని చూస్తున్నారు. దానిపై ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సచివాలయాలు హైదరాబాదులో కొనసాగుతున్నాయి. ఏపీ సచివాలయం దశలవారీగా అమరావతికి వెళ్తోంది. వారికి కేటాయించిన బ్లాకులు ఒక్కొక్కటిగా ఖాళీ అయిన అనంతరం వాటిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించనున్నారు.
పాత సచివాలయాన్ని కూలగొట్టి కొత్తగా పునర్ నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, మంత్రులు ఇంటి నుంచి పని చేయనున్నారు. అలాగే, కొత్త సచివాలయం నిర్మించే వరకు.. కొందరు అధికారులు ప్రత్యామ్నాయ భవనాల కోసం చూస్తున్నారు. కొత్త భవనాలు దొరికిన కార్యాలయాలు అక్కడి నుంచి పని చేస్తాయి. దొరకని కార్యాలయాల అధికారులు, మంత్రులు కొత్త సచివాలయం నిర్మించే వరకు ఇంటి నుంచి పని చేయెచ్చు.
కొత్త సచివాలయాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే, రెండేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ముంబైకి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ హఫీజ్ బృందం సచివాలయ నిర్మాణ నమూనాను రూపొందించింది. కొత్త సచివాలయానికి రూ.200 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు.