‘ఎన్నాళ్లీ 144 సెక్షన్?: వారిని స్వేచ్ఛగా తిరగనీయండి’
హైదరాబాద్: మెదక్ జిల్లా సిద్దిపేట డివిజన్ తొగుట మండలం వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాల్లో 144 సెక్షన్ విధింపు, కొనసాగింపునకు రెవెన్యూ, పోలీసు అధికారులు చూపుతున్న కారణాలు సమంజసంగా లేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ రెండు గ్రామాల ప్రజలను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఆ రెండు గ్రామాల ప్రజల నివాసిత హక్కుల్లో జోక్యం చేసుకోరాదని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. గ్రామాల్లో స్వేచ్ఛగా తిరగడానికి, వ్యాపార అవసరాల నిమిత్తం వస్తువులను తరలించడానికి అనుమతించాలని ఆదేశించింది. గ్రామాల్లో తిరిగేవారి గుర్తింపుకార్డులు చూపాలనిగానీ, ఎక్కడికి వెళుతున్నారో చెప్పాలని గానీ ఒత్తిడి తీసుకురాకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.
తొగుట మండలం వేములఘాట్ గ్రామంలో 144 సెక్షన్ విధించడాన్ని సవాలు చేస్తూ వై సంతోష్రెడ్డి, మరో ఐదుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలను విన్న జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు సోమవారం తీర్పు వెలువరించారు.
పోలీసు, రెవెన్యూ అధికారుల తీరును న్యాయమూర్తి తప్పుబట్టారు. జులైలో ఆయుధాలు, కర్రలు, కత్తులు, లాఠీలతో గుమికూడుతుండటంతో 144 సెక్షన్ను విధిస్తున్నట్లు తహసిల్దార్ పేర్కొన్నారని, అయితే ఉత్తర్వులను 2 నెలలకు మించి పొడిగించడానికి వీల్లేదని పేర్కొన్నారు.
144 సెక్షన్ విధింపు సందర్భంగా తాహసిల్దార్ చెప్పిన కారణాలను అంగీకరించినా.. అవి సముచితమైనవిగా అభిప్రాయపడలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
శాంతి భద్రతలకు భంగం కలిగించే పరిస్థితి కానీ, 144 సెక్షన్ విధించే అత్యవసర పరిస్థితులు కానీ అక్కడ లేవన్నారు. అధికారులు తమ పరిధికి మించి గ్రామాల హక్కుల్లో జోక్యం చేసుకున్నారన్నారు. జీవో 123పై హైకోర్టు ఉత్తర్వులు ఉన్నపుడు తహసిల్దార్ పరిధికి మించి 144 సెక్షన్ విధించినట్లుందన్నారు.