సర్వే, సాయన్నకు షాక్, టీఆర్ఎస్కు రెబల్స్ షాక్
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఓట్ల లెక్కింపు ముగిసింది. ఎనిమిది వార్డులకు గానూ నాలుగు వార్డుల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మరో ఇద్దరు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు గెలుపొందారు.
దీంతో టీఆర్ఎస్ నేతలు ఇద్దరు రెబల్ అభ్యర్థులతో సంప్రదింపులు జరపగా తాము టీఆర్ఎస్లోనే కొనసాగుతామని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఆరు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి రాగా, మిగతా రెండింటిలో ఒక వార్డులో కాంగ్రెస్ విజయం సాధించగా, మరొక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
ఒకటోవార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి జంపన్న ప్రతాప్పై పార్టీ రెబల్ అభ్యర్థి జక్కుల మహేశ్వర్రెడ్డి 863 ఓట్ల తేడాతో గెలుపొందారు. రెండవ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సాదా కేశవరెడ్డి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ కుమార్తె సుహాసినిపై 2,087 ఓట్ల తేడాతో గెలుపొందాడు. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత సర్వేసత్యానారాయణ కుమార్తె ఓటమి చెందారు.
మూడో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి జంపన్న ప్రతాప్ భార్య విద్యామతిపై టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి 600 ఓట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగో వార్డులో సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె నందితా లాస్యపై టీఆర్ఎస్ అభ్యర్థి నళిని కిరణ్ 530 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఇక ఐదో వార్డులో మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ కుమారుడు నవనీత్ ఓటమి పాలయ్యారు. సర్వే కుమార్తె సుహాసిని కూడా రెండో వార్డులో ఓటమి పాలవ్వడంతో సర్వే ఇంటి వద్ద నిశ్సబ్ధ వాతావరణం నెలకొంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్ సభ స్ధానం నుంచి సర్వే కూడా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
కంటోన్మెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం ఎనిమిది వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఒక్క చోట కూడా ఈ కూటమి ఖాతా తెరవలేదు. ఈ ఎన్నికల్లో మొత్తం 114 మంది పోటీ పడ్డారు.