సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం: డ్రోన్ ద్వారా రెండు మృతదేహాల గుర్తింపు
హైదరాబాద్: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని దక్కన్ స్పోర్ట్స్ నిట్వేర్ మాల్లో భారీగా అగ్ని ప్రమాదం జరిగి అగ్నికి అహుతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురిని అగ్ని ప్రమాద సిబ్బంది రక్షించారు. అయితే, గుజరాత్కు చెందిన మరో ముగ్గురు కూలీలు జునైద్, వీసం, జహీర్ ఆచూకీ లభించలేదు.
కూలీల సెల్ఫోన్ లోకేషన్ మంటలు చెలరేగిన భవనంలోనే చూపిస్తుండటంతో వారు సజీవ దహనమయ్యే అవకాశం ఉందనే అనుమానాలున్నాయి. దీంతో గురువారం ఉదయం నుంచి వారి కోసం గాలింపు చేపట్టారు. 22 ఫైరింజిన్లతో మంటలు పూర్తిగా ఆర్పివేసినప్పటికీ.. భవనంలో వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ సిబ్బంది మాల్ లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో డ్రోన్ కెమెరాల ద్వారా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు.
భవనం రెండో అంతస్తులో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న రెండు మృతదేహాలను డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించినట్లు తెలిసింది. అయితే, దీనిపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. భవనం లోపల పరిస్థితిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. డ్రోన్ కెమెరా ద్వారా సమాచార సేకరణకు ప్రయత్నిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. భవనం లోపల ఇంకా వేడిగానే ఉందని, దీంతో లోపలికి ఎవరూ వెళ్లలేకపోతున్నారన్నారు.
ప్రస్తుతం డ్రోన్ ద్వారా రెండు మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. కానీ, దీనిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు, మూడో వ్యక్తికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో గాలింపు కొనసాగుతోంది.