అర్ధరాత్రి ఉలిక్కిపడ్డ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
ఢిల్లీలోని చారిత్రాత్మక రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పేలుడులో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారికి ఢిల్లీ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తోన్నారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉంటోంది. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో ఈ పేలుడు సంభవించింది.
గుజరాత్ లో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పేలుడు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని తర్వాత ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసమ్మర్థంతో కూడుకుని ఉన్న ప్రదేశాలు, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై నిఘా పెంచారు. రాత్రంతా పోలీసులు పహారా చేపట్టారు. వాహనాల తనిఖీ ముమ్మరంగా కొనసాగింది. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం వదిలిపెట్టారు.

ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు విస్తృతంగా తనిఖీలను నిర్వహించారు. బాంబు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది అణువణువూ గాలించారు. ప్రయాణికుల లగేజీని సోదా చేశారు. కొందరు ప్రయాణికుల వివరాలను సైతం అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రాత్రివేళ సుమారు రెండు గంటలకు పైగా ఈ సోదాలు కొనసాగాయి.
హైదరాబాద్ నగర పోలీసులు, రైల్వే రక్షక బలగాలు, జీపీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ఈ సోదాలను నిర్వహించారు. టికెట్ కౌంటర్ రూమ్స్, ప్లాట్ ఫామ్స్, ప్రయాణికుల రెస్ట్ రూమ్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఈ తనిఖీ కొనసాగింది. లిఫ్టుల్లో కూడా డాగ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రయాణికులను విచారించారు. కొందరు ప్రయాణికుల ఆధార్ కార్డు వివరాలను అడిగి తెలుసుకోవడం కనిపించింది.












Click it and Unblock the Notifications