హైదరాబాద్లో ఆంధ్రులకు రక్షణ: చంద్రబాబుకు కెసిఆర్ కౌంటర్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసులో ముందుకు వచ్చిన ఆంధ్రులకు హైదరాబాద్లో భద్రత లేదంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాదనను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తిప్పికొడుతున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే జయసుధ తనయుడు శ్రేయాన్ సినిమా బస్తీ సినిమా ఆడియో విడుదల వేడుకకు హాజరై చిత్ర సీమకు భరోసా ఇచ్చారని అంటున్నారు.
చిత్రంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్, టిడిపి అనుకూలంగా ఉంటారని భావిస్తున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దాసరి నారాయణ రావు, మోహన్ బాబు, రాజశేఖర్, జీవిత సరేసరి. పద్మాలయ స్టూడియో భూకబ్జా వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో దర్శకురాలు విజయనిర్మల కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలుగు చిత్రసీమలో సీమాంధ్రుల ఆధిపత్యం ఉందనే వాదన ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో వారి ఆస్తులకు రక్షణ లేదనే వాదనను కూడా ముందుకు తెచ్చే ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కెసిఆర్ వ్యూహాత్మకంగా ఈ వేడుకల్లో ప్రసంగించారని అంటున్నారు. కార్యక్రమానికి హాజరు కాని అక్కినేని నాగార్జున, వెంకటేష్ పేర్లను కూడా ఆయన ప్రస్తావించారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ వివాదం నేపథ్యంలో కెసిఆర్ చాలా జాగ్రత్తగా ఎవరికీ తాము వ్యతిరేకం కాదనే పద్ధతిలో మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
హైదరాబాదులో ఆంధ్రులకు భద్రత లేదని, సెక్షన్ 8ని అమలు చేయాలని చంద్రబాబు కూడా ఇంతకు ముందు అన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టిడిపి నాయకులు ఓటుకు నోటు కేసు వివాదం ప్రారంభమైనప్పటి నుంచి అదే మాట మాట్లాడుతున్నారు. గవర్నర్ నరసింహన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వాదనను తిప్పికొట్టడానికి బస్తీ ఆడియో విడుదల కార్యక్రమాన్ని కెసిఆర్ ఉపయోగించుకున్నారని అంటున్నారు.
కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పేరును కూడా ఆయన రెండు సార్లు ప్రస్తావించారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరనే విషయాన్ని కెసిఆర్ చెప్పకనే చెప్పారని అంటున్నారు. అదే విధంగా హైదరాబాదులో స్థిరపడిన చిత్రసీమకు, ఆంధ్రుల ఆధిపత్యం ఉన్నప్పటికీ ఢోకా లేదనే భరోసాను కెసిఆర్ ఇచ్చారు.
అదే సమయంలో చిత్రసీమకు చెందిన వివాదాస్పద విషయాలను కూడా ఆయన పక్కన పెట్టలేదు. వాటిని చెప్పకుండా కొన్ని సమస్యలు ఉన్నాయంటూ వాటిని పరిష్కరించుకుందామని కూడా ఆయన చెప్పారు. మొత్తం మీద, కెసిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, చంద్రబాబు వాదనను తిప్పికొట్టినట్లు భావిస్తున్నారు.