దేశవ్యతిరేకులకు మద్దతు: రాహుల్ గాంధీ, కేజ్రీవాల్పై హైద్రాబాద్లో కేసు
హైదరాబాద్: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యు) ఘటన అంశంపై ఏఐఏసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వామపక్ష నేత సీతారామ్ ఏచూరీ, జెఎన్యు విద్యార్థి నేతలు కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్ తదితరుల పైన హైదరాబాదులోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.
ప్రముఖ న్యాయవాది జనార్ధన్ గౌడ్ ఎల్బీ నగర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు సరూర్ నగర్ పోలీసులు.. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, సీతారాం ఏచూరీలతో పాటు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్, సిపిఐ నేత రాజా, కన్నయ్య కుమార్, ఖలీద్ తదితర 9 మంది పైన కేసు నమోదు చేసారు.
మీడియాలో వస్తున్న వీడియోల ఆధారంగా.. జెఎన్యు విద్యార్థులు జాతి వ్యతిరేక నినాదాలు చేశారని, రాహుల్ గాంధీ తదితర రాజకీయ నాయకులు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విద్యార్థులకు అండగా నిలబడ్డారని, ఈ నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేయాలని సదరు న్యాయవాది పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
రాహుల్ గాంధీపై కేసు సరికాదు
రాహుల్ గాంధీ ఉగ్రవాదులకు మద్దతు పలికిన విద్యార్థులకు మద్దతిచ్చారంటూ హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడాన్ని ఆ పార్టీ తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. రాహుల్ పైనమ కేసు సరికాదన్నారు.
దేశం కోసం త్యాగాలు చేసిన రాహుల్ కుటుంబంపై కేసులా? అన్నారు. ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరితీసింది కాంగ్రెస్సేనని గుర్తించాలని, దేశద్రోహులకు కాంగ్రెస్ ఎన్నడూ మద్దతు పలకదన్నారు.
అమాయక విద్యార్థులపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణలో తమ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ వీడరని చెప్పారు. తెరాస మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. బీసీ కులాల తొలగింపుపై బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.