దారుణం: లిఫ్ట్ ఇస్తానని లైంగిక దాడి, తీవ్రగాయాలతో ఆసుపత్రిలో విద్యార్థిని, ఏం జరిగింది?
ఇంజనీరింగ్ విద్యార్థినిపై నలుగురు సీనియర్లు లైంగికదాడికి చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అపస్మారక స్థితికి చేరిన ఆమెను రోడ్డు ప్రమాదంలో గాయపడిందంటూ నమ్మించి ఆసుపత్రిలో చేర్చారు.
హైదరాబాద్:ఇంజనీరింగ్ విద్యార్థినిపై నలుగురు సీనియర్లు లైంగికదాడికి చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అపస్మారక స్థితికి చేరిన ఆమెను రోడ్డు ప్రమాదంలో గాయపడిందంటూ నమ్మించి ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఈ కేసు బయటకు పొక్కకుండా పక్కదారి పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హైద్రాబాద్ నగర శివారులోని బోడుప్పల్ లో ఈ ఘటన చోటుచేసుకొంది.విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షలు రాసేందుకు కొద్దిరోజులుగా మరో కళాశాలకు వెళ్తోంది. శనివారం మధ్యాహ్నం పరీక్ష రాసిన తర్వాత ఇంటికి వెళ్ళేందుకు సిద్దమైంది. అయితే అప్పటికే ఆమె కాలేజీ బస్సు వెళ్ళిపోయింది. అంతలో తన సీనియర్ విద్యార్థి ఒకరు అక్కడ కన్పించాడు.
దాంతో అతని బైక్ పై ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో సీనియర్ విద్యార్థి ఆమెను నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్ళాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు మరో ముగ్గురు సీనియర్లు అక్కడికి చేరుకొన్నారు. నలుగురు కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడినట్టు సమాచారం.
అపస్మారకస్థితికి చేరుకొన్న విద్యార్థినిని బోడుప్పల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. బైక్ వస్తోంటే ప్రమాదం జరిగినట్టు వైద్యులను నమ్మించారు. కాలు విరిగి, తలకు బలమైన గాయాలతో విద్యార్థిని అపస్మారక స్థితిలో ఆసుపత్రికి చేరినట్టు వైద్యులు నిర్ధారించారు.
ఈ సమాచాం అందుకొన్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొన్నారు. విద్యార్థులను విచారించారు. నలగురు విద్యార్థులు కూడ పొంతనలేని సమాధానాలు ఇచ్చారని సమాచారం.నలుగురు విద్యార్థులకు కూడ ఎలాంటి గాయాలు కాలేదు. వారు ప్రయాణించిన ద్విచక్ర వాహనాలు కూడ చెక్కుచెరదకుండా ఉన్నాయి. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగి ఉండవచ్చని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని అపస్మారక స్థితిలో ఉండడం, ఆమె తల్లిదండ్రులు వరంగల్ నుండి రావాల్సి ఉండడంతో పోలీసులు ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.