వరుసగా ఇలా.. కేసీఆర్కు ఎదురుగాలి: రేవంత్ రెడ్డి ఆనందం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఇటీవల వరుస దెబ్బలు తగులుతున్నాయి. జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జనగామ, గద్వాల, ములుగు, సిరిసిల్ల రగులుకోవడం, ఇటీవల జనగామ ప్రాంతంలో ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో తెరాస ఓటమి, హైకోర్టులో టిడిపి విలీనంపై చుక్కెదురు కావడం.. ఇలా వరుసగా ఎదురు గాలి తగులుతోందని అంటున్నారు.
కెసిఆర్ హవా
తెలంగాణ వచ్చిన తర్వాత రెండెళ్ల వరకు కేసీఆర్కు తెరాసకు తిరుగు లేకుండా పోయింది. అందుకు వరంగల్ తదితర ఉప ఎన్నికలతో పాటు, హైదరాబాద్ (గ్రేటర్ హైదరాబాద్) ఎన్నికల్లో 99 కార్పోరేట్ సీట్లను తెరాస గెలుచుకోవడం గమనార్హం. అయితే, ఇప్పుడు కేసీఆర్కు ఎదురు గాలి వీస్తోందని అంటున్నారు.
జిల్లాల రగడ
తెలంగాణలో మరిన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ తొలి నుంచి భావిస్తున్నారు. ఇందులో భాగంగా మరో పద్నాలుగు పదిహేను కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే, జనగామ, గద్వాల, ములుగు, సిరిసిల్ల వాసులు తమ ప్రాంతాలను జిల్లాలుగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణంగానే జనగామలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో తెరాసకు షాక్ తగిలిందని అంటున్నారు. కేసీఆర్కు ఎదురు గాలి వీస్తోందని విపక్షాలు అంటున్నాయి.
తెరపైకి కోదండరాం
తెలంగాణలో కెసీఆర్కు ఎదురు లేకుండా పోవడంతో.. కాంగ్రెస్, టిడిపి, బిజెపిలకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇలాంటి సమయంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తెరపైకి వచ్చారు. కెసీఆర్ను కోదండ ఏ మేరకు అడ్డుకోగలరనే విషయాన్ని పక్కన పెడితే, పలు సమస్యల పైన ఆయన ప్రభుత్వాన్ని నిలదీయడం చర్చనీయాంశంగా మారింది.
రేవంత్ రెడ్డి పైచేయి
2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది తెరాసలో చేరారు. దీంతో తెలంగాణ టిడిపిని తెరాసలో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. దీనిని రేవంత్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టులో కేసీఆర్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. తెరాసలో టిడిపి విలీనం పైన నిర్ణయం ఇప్పుడే కాదని, తెరాసలో చేరిన వారి డిస్క్వాలిఫై పైన నిర్ణయం తీసుకున్నాక విలీనంపై నిర్ణయం ఉండాలని న్యాయస్థానం షాకిచ్చింది.