హైదరాబాద్ హోటల్స్లో కుక్క బిర్యానీ!: దుష్ప్రచారం చేసిన యువకుడి అరెస్టు
హైదరాబాద్ హోటళ్లలో చేసే బిర్యానీలో కుక్కమాంసం కలుపుతున్నారనే భోగస్ ప్రచారానికి తెరలేపాడు.
హైదరాబాద్: స్నేహితులేమో రోజూ బిర్యానీ తిందామన్నారు. కానీ తన వద్ద రోజూ బిర్యానీ తినేంత డబ్బు లేదు. ఏం చేయాలి? ఏకంగా బిర్యానీ అంటేనే వెగటు పుట్టేలా చేస్తే! అతగాడిలోను ఇదే ఆలోచన మొదలైంది. ఇంకేముంది.. హైదరాబాద్ హోటళ్లలో చేసే బిర్యానీలో కుక్కమాంసం కలుపుతున్నారనే భోగస్ ప్రచారానికి తెరలేపాడు.
సోషల్ మీడియా నుంచి కుక్క మాంసానికి సంబంధించిన ఫోటోలను డౌన్ లోడ్ చేసి.. హైదరాబాద్ హోటళ్లలో జరుగుతున్న తతంగం ఇదేనంటూ అటు స్నేహితులను మభ్యపెట్టడంతో పాటు సోషల్ మీడియాలోను దీనిపై విస్తృతంగా ప్రచారం చేశాడు. ఈ దుష్ప్రచారం ఎఫెక్ట్ ఓ హోటల్ పై తీవ్రంగా పడటంతో.. ఓ హోటల్ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. మొత్తానికి దీనిపై ఆరా తీసిన పోలీసులు సదరు ఫేక్ ప్రచారకుడిని పట్టేసుకున్నారు.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. మదీన, రికబ్గంజ్ లో నివాసముండే వలబోజు చంద్రమోహన్ ఎంబీఏ చదువుతున్నాడు. అతనితో పాటు మరో ముగ్గురు స్నేహితులు కలిసి శాలిబండలోని షాగౌస్ హోటల్కు వెళ్లి బిర్యానీ తినడం అలవాటు. డిసెంబర్ తొలివారం నుంచి రోజూ ఆ హోటల్లో బిర్యానీ తినాల్సిందేనని చంద్రమోహన్ ను స్నేహితులు ఒత్తిడి చేశారు.
అయితే తనవద్ద అంత డబ్బు లేకపోవడంతో.. ఈ ప్లాన్ ను ఎలాగైనా చెడగొట్టాలని చంద్రమోహన్ భావించాడు. 'హైదరాబాద్లోని హోటళ్లలో చేసే బిర్యానీలో కుక్కమాంసం కలుపుతున్నారు.. హోటళ్లలో ఎక్కువగా తినేవారు తస్మాత్ జాగ్రత్త' అంటూ వాట్సాప్ ద్వారా ప్రచారానికి తెరలేపిన చంద్రమోహన్.. దానికి షాగౌస్ హోటల్ ఫోటోలను జతచేశాడు. 161మంది సభ్యులున్న అగర్వాల్ స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో దీన్ని షేర్ చేయడంతో విషయం కాస్త వేగంగా ప్రచారం జరిగింది.
దీంతో ఈ విషయం ఏకంగా మీడియా చానెళ్లకు సైతం ఎక్కి చక్కర్లు కొట్టింది. ఇదే విషయం జీహెచ్ఎంసీ అధికారుల చెవిన కూడా పడటంతో ఆ హోటల్పై ఈనెల 13న దాడిచేసి శాంపిల్స్ సేకరించారు. దీంతో షాగౌస్ హోటల్ యాజమాన్యం బిర్యానీలో కుక్కమాంసం కలుపుతోందన్న ప్రచారం మరింత జోరందుకుంది. దీంతో షా గౌస్ హోటల్ యజమాని రబ్బానీ రాయదుర్గం, సైబర్ క్రైం పోలీసులకు ఈనెల 14న ఫిర్యాదు చేశాడు.
నిరాధారంగా తన హోటల్ పై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించగా.. దీనికి మూలకారకుడు చంద్రమోహన్ అన్న సంగతి తేలింది. తొలుత సికింద్రాబాద్కు చెందిన సంతోష్కు అనే స్నేహితుడికి కుక్క మాంసం ఫోటోలను పంపినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ నెల 8న అగర్వాల్ స్కూల్ వాట్సాప్ గ్రూపులో దీన్ని పోస్టు చేసినట్టుగా పోలీసులు తెలిపారు.
మొత్తానికి ఈ దుష్ప్రచారానికి పాల్పడిన వలబోజు చంద్రమోహన్ను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం గచ్చిబౌలి కమిషనరేట్లో నిర్వ హించిన విలేకరుల సమావేశంలో సైబర్ క్రైం ఏసీపీ జయరాం వివరాలు వెల్లడించారు. స్నేహితుల చేత బిర్యానీ మాన్పించడానికే చంద్రమోహన్ ఇలా చేశాడని జయరాం తెలిపారు.
కాగా, హోటల్పై తనకెలాంటి శత్రుత్వం లేదని సరదా కోసమే ఇదంతా చేశానని నిందితుడు పేర్కొనడం గమనార్హం. సమస్యను త్వరగా పరిష్కరించినందుకు షాగౌస్ హోటల్ యజమాని రబ్బానీ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.