తెలంగాణలో మరో ఏడు కరోనా పాజిటివ్ కేసులు.. 13కి చేరిన సంఖ్య..
తెలంగాణలో మరో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.బుధవారం(మార్చి 18) సాయంత్రం ఇండోనేషియా నుంచి హైదరాబాద్ వచ్చినవారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో వారిని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి 10 గంటలకు విడుదల చేసిన బులెటిన్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరింది. వీరంతా విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారే. తెలంగాణలో ఉన్నవారిలో ఇంతవరకూ ఎవరికీ కరోనా సోకలేదు.
మరోవైపు ఢిల్లీ నుంచి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఈ నెల 13న రామగుండం రైల్వే స్టేషన్లో దిగిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా గుర్తించారు. అతనితో పాటు ప్రయాణించినవారి వివరాలను ప్రభుత్వం రైల్వే శాఖను కోరింది. అయితే ఆ వ్యక్తి ఎవరన్న దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు.
మరోవైపు తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో దాదాపు 20వేల మంది విదేశాల నుంచి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని వేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కారాబాద్, దూలపల్లిలో క్వారంటైన్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయని, వాటితోపాటు మరికొన్ని స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
Recommended Video
కాగా,దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 169కి చేరింది. కొత్తగా మరో 12 కేసులు నమోదయ్యాయి. ఇందులో 25 మంది విదేశీయులు ఉన్నారు. ఇప్పటివరకు ముగ్గురు మృత్యువాతపడగా.. అందులో ఒకరు ఢిల్లీ,ఒకరు కర్ణాటక,ఒకరు మహారాష్ట్రకు చెందినవారున్నారు. వైరస్ వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం(మార్చి 19)న అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతారు.