Rain in Hyderabad : హైదరాబాద్లో భారీ వర్షం... జలమయమైన పలు ప్రాంతాలు...
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సోమవారం(సెప్టెంబర్ 20) సాయంత్రం భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్,తార్నాక,ఉప్పల్,హబ్సిగూడ,రామంతపూర్,ఆర్టీసీ క్రాస్ రోడ్,విద్యానగర్,అంబర్పేట్,రాంనగర్,దోమలగూడ,చిలకలగూడ,అల్వాల్,బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వానకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.కొన్నిచోట్ల మోకాలి లోతు నీళ్లు చేరాయి.
అంతకుముందు,హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.సాయంత్రం తర్వాత ఒక గంటపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.

తెలంగాణకు రానున్న మూడు రోజులు వర్ష సూచన :
తెలంగాణలో రానున్న మూడు రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు సోమవారం వాతావరణ కేంద్రం పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది.శనివారం ఏర్పడిన ఉపరితల ద్రోణి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షి తమిళనాడు వరకు స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలోనూ 1500మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఈ ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో సోమ,మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.
భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కొమ్రంభీం అసిఫాబాద్, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్, జనగామ, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. చాలా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
అటు ఆంధ్రప్రదేశ్లోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు ఉరుములు,మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు శనివారం ఏర్పడిన 'ఉపరితల ద్రోణి' ప్రస్తుతం సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications