వైద్య విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ రేప్: భార్యాపిల్లలతో పరారీ
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ పవార్ను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎం. జగన్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. రిమ్స్లో ద్వితీయ సంవత్సరం మెడిసిన్ చదువుతున్న ఒక విద్యార్థినిపై అత్యాచారం యత్నానికి పాల్పడి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు రెండు వారాల కిందటే విద్యార్థిని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు,
గత 15వ తేదీ నుండి విధులకు హాజరు కాకుండా డాక్టర్ సందీప్ పవార్ పరారీలో ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు డాక్టర్ సందీప్ పవార్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
లైంగికదాడికి యత్నించిన వైద్యుడు సందీప్ పవార్పై ఈనెల 12న ఆదిలాబాద్ టూటౌన్లో కేసు కాగా, 13న వన్టౌన్కు బదిలీ చేశారు. 13న సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన సదరు వైద్యుడు ఇంటికి తాళం వేసి భార్యాపిల్లలతో పారిపోయాడు.
అప్పటి నుంచి ఆ వైద్యున్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎక్కడున్నాడనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. 11రోజులుగా ప్రత్యేక హెలిక్యాప్టర్లో ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నట్లు సిగ్నల్స్ ద్వారా పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఆయన బంధువుల ఇళ్లు, లాడ్జిల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వైద్యుడి సోదరుడిని వన్టౌన్ పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిసింది.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఉదయగౌరి విద్యార్థిని వాగ్మూలాన్ని రికార్డు చేశారు. మరోవైపు మెడికో వ్యవహారంలో రిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ పూర్తిగా వైఫల్యం చెందారని అధికార పార్టీ జడ్పీటీసీలు, దళిత సంఘాల నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
వైద్య విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన డా.సందీప్ పవార్ను వెంటనే అరెస్టు చేసి విధుల నుంచి తొలగించాలని జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా దళిత సంఘ నాయకులతో కలిసి కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టాయి.
వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో నిందితుడు వైద్యుడు సందీప్ పవార్కు తాను మద్దతివ్వలేదనీ, అతనిపై చర్యలు తీసుకోవాలని డీఎంఏకు ఫిర్యాదు కూడా చేశామని రిమ్స్ డైరెక్టర్ డా.ఎ. అశోక్ స్పష్టం బుధవారం మీడియా సమావేశంలో చెప్పారు.
రిమ్స్లో పిల్లలను సంరక్షించే బాధ్యత తనపై ఉందన్నారు. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం విద్యార్థినీ తోటి విద్యార్థులతో కలిసి సందీప్ పవార్ ఆసుపత్రికి వెళ్లిందన్నారు. అక్కడ జరిగిన విషయాలు తనకేమీ తెలియవన్నారు. విద్యార్థినీ దవాఖాన భవనంపైకెక్కి ఆత్మహత్యకు ప్రయత్నించగా.. తోటి స్నేహితులు ఆమెను రక్షించి పోలీస్ అవుట్ పోస్టింగ్ సిబ్బందికి అప్పగించారన్నారు.
విద్యార్థిని మానసిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డాకే ఫిర్యాదు స్వీకరిస్తామని పోలీసులు చెప్పారని తెలిపారు. ఆ తర్వాత విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి ఈ నెల 12న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని, సందీప్పై కేసులు నమోదయ్యాయన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా రిమ్స్ మెడికల్ కళాశాలలో, ఆస్పత్రిని పర్యవేక్షిస్తున్నామన్నారు.
అనంతరం ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు మనోహర్ మాట్లాడుతూ తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్షకు అర్హులేనని అన్నారు. సందీప్ పవార్ కోర్టులో లొంగిపోవాలన్నారు. గౌరవ ప్రదమైన వైద్య వృత్తికి భంగం కలగకుండా చూడాలన్నారు. రిమ్స్ మెడికల్ విద్యార్థినీ చదువుకోడానికి అన్ని వసతులు కల్పించడంతో పాటు ఆమెకు రక్షణ కల్పిస్తామన్నారు. ప్రొఫెసర్లు ఎవరైనా వేధింపులకు పాల్పడితే, విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.