వివాహిత అనుమానాస్పద మృతి: గిరిజన బాలికపై లైంగిక దాడిే
హైదరాబాద్: గిరిజన బాలికపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన నల్గొండ జిల్లా సూర్యాపేటలో బుధవారం రాత్రి వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం సూర్యాపేట పట్టణంలోని నెహ్రూనగర్లో ఉన్న ఎస్సీ(ఏ) బాలికల వసతిగృహంలో ఉంటున్న ఓ గిరిజన బాలిక సమీపంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది.
బాలికల వసతిగృహానికి ఎదురుగా ఉన్న ఇంట్లో షేక్ సైదా(20) అనే వ్యక్తి అద్దెకు ఉండి పాలవ్యాపారం చేస్తున్నాడు. ఇతని సొంతూరు నేరేడుచర్ల మండలం బొత్తలపాలం గ్రామం. విద్యార్థిని పాఠశాలకు వెళ్లి వచ్చే క్రమంలో సైదా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. విద్యార్ధినికి మాయమాటలు చెప్పి లోబరుచుకోవడమే కాకుండా తన కామవాంఛను తీర్చుకున్నాడు.
జరిగిన విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో సూర్యాపేట పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. దీంతో నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, రేప్ కేసులతో పాటు పోక్సోయాక్టు కింద కేసు కూడా నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి
హైదరాబాద్లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని సాగర్ రింగ్రోడ్డు తిరుమల నగర్లోని సాగర్ కాంప్లెక్స్లో బుధవారం అర్థ రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శ్రీలత(24)కు నాగరాజుతో ఏడాది క్రితం వివాహమైంది.
ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున శ్రీలత అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుంది. దీనిని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదనపు కట్నం కోసమే తమ కూతుర్ని పొట్టన పెట్టుకున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.