పొన్నాల, జానాలపై సొంత పార్టీ నేతల ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో టీపీసీసీ విఫలమైందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి శనివారం దుయ్యబట్టారు.
ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా నిర్వహించడంలో విఫలమైందన్నారు. ఈ విషయాన్ని తాను ఇటీవల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్ళానన్నారు. విద్యుత్ కోతలు, రుణ మాఫీ వంటి అనేక ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ విఫలమైందన్నారు.
సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వల్లే సర్కారు వైఫల్యాలను ఎండగట్టలేకపోతున్నదన్నారు. త్వరలో టీపీసీసీ, టీఎల్పీసీ నాయకత్వాల మార్పు జరుగుతుందన్నారు. జానారెడ్డి మంత్రి హోదా కోసం ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రతిపక్ష నాయకుడయ్యారని ఆరోపించారు.

మాజీ మంత్రి శంకర్ రావు కూడా పొన్నాల పైన నిప్పులు చెరిగారు. పార్టీకి నాయకత్వం వహించడంలో పొన్నాల విఫలమయ్యారన్నారు. వచ్చే నెలాఖరులోగా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని అధిష్ఠానం మార్చనున్నదన్నారు. ఉత్తరాంధ్ర తుపాను బాధితులకు ఆయన ఒక నెల పెన్షన్ను విరాళంగా ప్రకటించారు.
ప్రభుత్వానిదే బాధ్యత
రైతుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు జానారెడ్డి వేరుగా అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆయన విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలన్నారు.
కరవు, రైతుల సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు తమ పార్టీ నాయకులు కరీంనగర్లో ధర్నా నిర్వహిస్తే పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం అమానుషమన్నారు.












Click it and Unblock the Notifications