మనమెందుకు!: ఉద్యోగులకు టి షాక్, హైదరాబాద్ ర్యాంక్పై సోమేష్ ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగులకు షాక్! రేపో మాపో వేతనాలు పెరుగుతాయని భావించిన ఉద్యోగాలు ఆశలు ఆవిరయ్యాయి. వీరి జీతాల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించినట్లుగా తెలుస్తోంది.
సంబంధిత ఫైలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం వెనక్కి పంపించారని, జితాల పెంపు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల వ్యవహారమని, వారు చేయాల్సిన పనిని ప్రభుత్వం ఎందుకు చేయాలని ఆయన ఆర్థిక శాఖను ప్రశ్నించినట్లుగా తెలుస్తోందని వార్తలొస్తున్నాయి.
జిహెచ్ఎంసితో పాటు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్ ఉద్యోగులు తమ సేవలను క్రమబద్ధీకరించాలని, వేతనాలు పెంచాలని నిరసన చేపట్టారు. కొందరు ఆందోళన విరమించుకున్నప్పటికీ, మరికొందరు కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇతర శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని ఆర్థిక శాఖ కెసిఆర్ ఆమోదానికి పంపిన ఫైలు గురువారం తిరస్కారానికి గురైందని తెలుస్తోంది. దాదాపు రెండు లక్షల మంది దాకా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. అయితే, ఈ ఫైలు సిఎస్ స్థాయిలోనే తిరస్కారానికి గురైంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు వారి ఏజెన్సీలే చూసుకోవాలని రాజీవ్ శర్మ చెబుతున్నారని అంటున్నారు.
దేవాలయాల ఉద్యోగులకు పీఆర్సీ
దేవాలయాల ఉద్యోగులకు పీఆర్సీ-2015 వర్తింపజేసే ఫైలుపై సిఎం కెసిఆర్ గురువారం సంతకం చేశారు. రీజినల్ జాయింట్కమిషనర్(ఆర్జేసీ), డిప్యూటీ కమిషనర్(డీసీ), అసిస్టెంట్ కమిషనర్ హోదాల్లోని ఆలయాలలో పని చేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ-2015ను వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్కు 275 ర్యాంక్పై సోమేష్ ఆగ్రహం
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన స్వచ్ఛ భారత్ సర్వే పైన జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులో శాస్త్రీయత లేదన్నారు. ఏ ప్రాతిపదికన కేటాయించారో వివరాలు చెప్పాలన్నారు.
స్వచ్ఛ భారత్లో హైదరాబాదుకు 275 ర్యాంకు రావడంపై ఆయన మాట్లాడుతూ... సర్వే ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారని ప్రశ్నించారు. ఆ విషయాలపై తనకు సమాచారం లేదన్నారు. చాలా నగరాల కంటే హైదరాబాద్ మెరుగు అన్నారు.