షాకింగ్: ఏటా వేల సంఖ్యలో అమ్మాయిలు, అబ్బాయిలు.. వీళ్లంతా ఏమైపోతున్నట్లు?
హైదరాబాద్: బాలుడు అదృశ్యం, బాలిక అదృశ్యం.. అంటూ అప్పుడప్పుడూ మనం వార్తలు వింటూ ఉంటాం. కానీ ఒక్క ఏడాదిలో 4700 మంది పిల్లలు అదృశ్యమయ్యారంటే వినడానికి కొంత విచిత్రంగానూ, కొంత బాధగానూ ఉంటుంది.
కానీ ఇది నిజం, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది 4700 మంది పిల్లలు అదృశ్యం కావడం సంచలనం రేపుతోంది. గత ఏడాది 2,921 మంది బాలికలు, 1779 మంది బాలురు ఇళ్ల నుంచి తప్పిపోయారని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది.
పోలీసు రికార్డుల ప్రకారం.. 2016లో ఇలా తప్పిపోయిన 4700 మంది పిల్లల్లో కేవలం 1021 మందిని (377 బాలురు, 644 మంది బాలికలు) మాత్రమే పోలీసులు గుర్తించారు. ఇంకా 1,402 బాలురు, 2,277 మంది బాలికలు సహా 3,679 మంది పిల్లల ఆచూకీ లభించలేదు.
ఒక్క తెలంగాణలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3324 మంది పిల్లలు, తమిళనాడు రాష్ట్రంలో 5801 మంది పిల్లలు తప్పిపోయారని కేసులు నమోదు అయ్యాయి. ఆగంతకులు పిల్లల్ని అపహరిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
కొందరు పిల్లలు ఇంటి నుంచి పారిపోయారని పోలీసు అధికారులు చెబుతున్నారు. తప్పిపోయిన పిల్లల ఆచూకీ కోసం పోలీసులు గాలించినా కొందరు పిల్లల జాడ మాత్రం తెలియడం లేదు.
దేశ వ్యాప్తంగా చూసుకుంటే పిల్లల అదృశ్యంలో దేశ రాజధాని నగరం ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఢిల్లీలో 2016లో మొత్తం 14,661 మంది పిల్లలు అదృశ్యమయ్యారు. వీరిలో బాలురు 6125 మంది కాగా బాలికలు 8536 మంది.
ఢిల్లీ తరువాతి స్థానం మధ్యప్రదేశ్ రాష్ట్రానిదే. ఇక్కడ ఏడాది కాలంలో మొత్తం తప్పిపోయిన పిల్లల సంఖ్య 12,068కాగా వీరిలో బాలుర సంఖ్య 3,446, బాలికల సంఖ్య 8,622. ఏ రాష్ట్రంలో చూసినా తప్పిపోతున్న పిల్లలో బాలికల సంఖ్యే అధికంగా కనిపిస్తోంది.