డ్రగ్ మాఫియా, దిగ్భ్రాంతికర విషయాలు: న్యూడ్ ఫోటోలతోను, ఇదీ స్కెచ్..
హైదరాబాద్ బేగంపేటలోని ఓ బడా స్కూల్లో చదువుతున్న 14ఏళ్ల బాలిక డ్రగ్ ఊబిలో అల్లాడిపోయింది.
హైదరాబాద్: రాజధానిలో వెలుగుచూసిన డ్రగ్ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా సంపన్న కుటుంబాలకు చెందిన టీనేజర్లను వారు టార్గెట్ చేసుకున్న తీరు విస్మయ పరుస్తోంది. మత్తుకు బానిసల్ని చేసి టీనేజీ యువతుల్ని ఏవిధంగా వాడుకున్నారన్న దానిపై తాజాగా ఓ ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది.
డ్రగ్ మాఫియా: సినీ నిర్మాత అరెస్టు.. కదలుతున్న తుట్టె!?
హైదరాబాద్ బేగంపేటలోని ఓ బడా స్కూల్లో చదువుతున్న 14ఏళ్ల బాలిక డ్రగ్ ఊబిలో అల్లాడిపోయింది. పథకం ప్రకారం.. వారిని ఎలా మత్తుకు బానిసల్ని చేశారో నగేశ్ అనే సైక్రియాటిస్ట్ వద్ద బాలిక పూసగుచ్చినట్లు వివరించింది. తమని నిస్సహాయుల్ని చేసి డ్రగ్ మాఫియా ఎంతలా తెగించిందన్న దానిపై బాలిక చెప్పిన వివరాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఐస్ క్రీమ్ పేరుతో:
స్నేహితులంతా ఓ చోట ఐస్ క్రీమ్ బాగుందని, ఒక్కసారి తింటే స్వర్గమేనని చెప్పడంతో.. ఆ బాలిక కూడా ఒక్కసారి దాన్ని టేస్ట్ చేయాలని ఉవ్విళ్లూరింది. అనుకున్నట్లుగానే అక్కడికి వెళ్లి ఐస్ క్రీమ్ తీసుకుంది. ఆ సమయంలో ఐస్ క్రీమ్ పై తెల్లపొడి చల్లి ఇచ్చారు.
ఇక ఆ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత బాలిక పరిస్థితి గాల్లో తేలిపోతున్నట్లే అనిపించింది. మళ్లీ మళ్లీ కావాలనిపించింది. పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీతో అదే పనిగా అక్కడికెళ్లి ఐస్ క్రీమ్ కొనుక్కుని తినడం.. మత్తులో జోగడం ఆమెకు వ్యసనంగా మారింది. అయితే ఇదంతా డ్రగ్స్ ఎఫెక్ట్ అని ఆమెకు తెలియలేదు.
తొలుత ఫ్రీగా ఎరవేసి:
స్నేహితులను పరిచయం చేస్తే చాలు తొలుత ఐస్ క్రీమ్ 'ఫ్రీ' అంటూ డ్రగ్ మాఫియా వల పన్నుతోంది. దీంతో ఒక్కసారి ఫ్రీ గా ఐస్ క్రీమ్ తిన్నవారు ఆ మత్తును మళ్లీ మళ్లీ కోరుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి.. ఆ తర్వాత నుంచి వారి వద్ద ముక్కు పిండి మరీ డ్రగ్ మాఫియా డబ్బులు గుంజుతోంది.
బేగంపేటకు చెందిన బాలికను కూడా రూ.3వేలు, రూ.5వేలు ఇస్తేనే డ్రగ్ ఇస్తామంటూ వేధించారు. ఓవైపు మత్తకు బానిసై.. మరోవైపు తనవద్ద అంత పాకెట్ మనీ లేక.. ఆ బాలిక విలవిల్లాడిపోయింది.
న్యూడ్ ఫోటోల పంపాలని:
తన వద్ద అంత డబ్బులు లేవని, కానీ తనకు ఆ ఐస్ క్రీమ్ కావాలని బాలిక అడగడంతో.. డబ్బుల్లేకపోతే న్యూడ్ ఫోటోలు పంపాలంటూ డ్రగ్ మాఫియా ఆ బాలికను డిమాండ్ చేసింది. చేస్తుంది తప్పని తెలిసినా.. మత్తుకు అలవాటుపడిన బాలిక.. వారు చెప్పినట్లే ఫోటోల్ని పంపించింది. అలా మళ్లీ మళ్లీ మత్తు పదార్థాలు సేవిస్తూ వచ్చింది.
చివరకు తమతో గడపాలని:
న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేయడం కూడా అయిపోయాక.. తమతో గడిపితేనే డ్రగ్ ఇస్తామని, ఇందుకోసం తాము చెప్పిన చోటుకు రావాలని బాలికను డ్రగ్ మాఫియా బ్లాక్ మెయిల్ చేసింది. వెళ్లాలా? వద్దా? అని బాలిక తర్జనభర్జన పడుతున్న సమయంలోనే.. తల్లిదండ్రులు ఆమె ప్రవర్తనలో మార్పు గమనించారు.
ఇంతలో డ్రగ్ మాఫియా గుట్టు రట్టవడం.. నగరానికి చెందిన నగేశ్ అనే సైక్రియాటిస్ట్ వద్దకు బాలికను తీసుకెళ్లడంతో.. అసలు నిజాలన్ని పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది.
మాఫియా వలలో 1200మంది పిల్లలు
డ్రగ్ మాఫియా విస్తరణకు హైదరాబాద్ సరైన ప్రాంతమని ఆ ముఠా భావించింది. ఇందుకోసం హైదరాబాద్ లోని 26స్కూల్స్, 27కాలేజీలను టార్గెట్ చేసింది. ముఖ్యంగా 8,9 తరగతుల విద్యార్థుల్నే కస్టమర్స్ గా మార్చుకోగలిగింది. గత గురువారం ఒక్కరోజే 40-50మంది పిల్లలు డ్రగ్ తీసుకున్నట్లు బేగంపేటకు చెందిన బాలిక సైక్రియాటిస్ట్ వద్ద వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది 8,9 తరగతులకు చెందినవారేనని తెలిపింది.
రెండో స్టేజీ కూడా దాటిపోయారు:
డ్రగ్ మాఫియా ఆగడాలు వెలుగులోకి రావడంతో.. నగరంలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పును గమనించినవారు.. సైక్రియాటిస్టుల వద్దకు పరుగులు పెడుతున్నారు. డ్రగ్ కు అలవాటైన విద్యార్థుల్లో చాలామంది ఇప్పటికే రెండో స్టేజీ కూడా దాటేశారని సైక్రియాటిస్ట్ నగేశ్ తెలిపినట్లు తెలుస్తోంది. ఇటువంటి సమయంలో తల్లిదండ్రులు భయపడకుండా ఉండాలని, వారు ధైర్యం కోల్పోకుండా పిల్లలకు బాసటగా నిలిచే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.