దేవుళ్ల చిత్రపటాల ముందు బిడ్డ నరబలి.. ఎవరో ఆ విషయం చెప్పడంతో... సూర్యాపేట ఘటనలో షాకింగ్ విషయాలు
పూజల పేరుతో కొంతమంది తల్లిదండ్రులు కన్నబిడ్డలను బలిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరచుగా వెలుగుచూస్తున్నాయి. రెండు రోజుల క్రితం తమిళనాడులో ఓ తల్లి తన ఇద్దరు కుమారులను నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించగా.. తప్పించుకుని వారు పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోనూ రెండు రోజుల క్రితం ఓ వివాహిత తన చంటిబిడ్డను నరబలి ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. బీఈడీ చదువుకున్న ఆ మహిళ... ఎవరో ఏదో దోషం ఉందని చెప్తే గుడ్డిగా నమ్మేసింది. అప్పటినుంచి ఏవేవో పూజలు చేస్తూ.. చివరకు తన కన్నబిడ్డనే నరబలి ఇచ్చింది.
మహిళను రెండో పెళ్లి చేసుకున్న తల్లి... విచిత్ర ప్రవర్తన.. శివుడు,శక్తి అంటూ కన్నబిడ్డలనే నరబలికి...
అసలేం జరిగింది...
సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాడు తండాకు చెందిన భారతికి ఆరేళ్ల క్రితం మొదటి వివాహం జరిగింది. విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత భారతి... కృష్ణ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఆర్నెళ్ల క్రితం ఓ పాప పుట్టింది. అయితే భారతికి నాగ దోషం ఉందని ఓ వ్యక్తి చెప్పడంతో... అప్పటినుంచి ఆమె మానసిక స్థితిలో మార్పు వచ్చింది. ఆమె కోలుకోవాలని పలు ఆలయాలు,చర్చిలు,దర్గాలకు తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు.
యూట్యూబ్లో చూసి ఏవేవో పూజలు...
నాగదోషం పోగొట్టుకునేందుకు యూట్యూబ్లో భారతి పలు వీడియోలు చూసింది. అప్పటినుంచి వివిధ దేవుళ్లకు ఏవేవో పూజలు చేస్తూనే ఉంది. ఇరుగుపొరుగు ఏమి పూజలని అడిగితే... మీకెందుకు అని కసురుకునేది. దీంతో చుట్టుపక్కలవారు ఆమె పూజల సంగతి తమకెందుకని మిన్నకుండిపోయారు. అయితే భారతి ఈ పూజల పిచ్చిలో పడి... నెలల వయసున్న బిడ్డను నిర్లక్ష్యం చేయడంతో భర్త కృష్ణ ఆందోళన చెందాడు. ఎక్కడ బిడ్డకు హాని తలపెడుతుందోనని బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.
దేవుళ్ల చిత్ర పటాల ముందు నరబలి...
గురువారం(ఏప్రిల్ 15) కృష్ణ ఏదో పని నిమిత్తం సూర్యాపేట జిల్లా కేంద్రానికి వెళ్లాడు. భార్య ప్రవర్తన గురించి తెలుసు కాబట్టి... వెళ్లేటప్పుడు అత్త,మామలకు చెప్పి మరీ వెళ్లాడు. ఇంటికి వెళ్లి.. తాను వచ్చేవరకూ పాపను చూసుకోవాలని చెప్పాడు. అయితే వారు వెళ్లడం కాస్త ఆలస్యం కావడంతో ఘోరం జరిగిపోయింది. దేవుళ్ల చిత్రపటాల ముందు బిడ్డను ఉంచి పూజలు చేసిన భారతి.. ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత స్థానికులు ప్రశ్నిస్తే... అసలెందుకు హత్య చేశానో తనకే తెలియదని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
విద్యావంతురాలే...
నిజానికి భారతి బీఈడీ చదువుకున్న విద్యావంతురాలు. త్వరలో తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని తెలిసి పరీక్షలకు కూడా ప్రిపేర్ అవుతోంది. కానీ ఇంతలోనే ఎవరో నాగదోషం అని చెప్పడంతో ఆమె పూర్తిగా మారిపోయింది. నిత్యం పూజలు చేస్తూ తెలియని లోకంలోకి వెళ్లిపోయింది. చుట్టూ అందరూ ఉన్నప్పుడు బాగానే ఉన్నా... ఒంటరిగా ఉన్నప్పుడు విచిత్రంగా ప్రవర్తించేది. చివరికిలా తన కన్నబిడ్డనే పొట్టనపెట్టుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు మదనపల్లెలోనూ ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు తమ ఇద్దరు కన్నబిడ్డలను నరబలి ఇచ్చిన సంగతి తెలిసిందే. సమాజంలో ఇటువంటి ఘటనలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.