టీఆర్ఎస్ కొంపముంచుతారా ఏంది ..!? పార్టీలు మారినా.. వారి నినాదాలు మారడం లేదు!
టిడిపి నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరి ఖమ్మం పార్లమెంట్ టికెట్ సంపాదించి టిఆర్ఎస్ పార్టీ నుండి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సారి ఖమ్మంలో ఎలాగైనా పాగా వెయ్యాలని చూస్తున్న గులాబీ దండు అలవాటులో పొరపాటు గా ఎన్నికల ప్రచారంలో తప్పులు చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న టీడీపీని సైకిల్ గుర్తును అంత త్వరగా మర్చిపోలేకపోతున్నారు ఇటీవల టీడీపీ నుండి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న నేతలు . అందుకే మొన్న నామా నేడు సండ్ర తప్పు చేశారు.
నారా రోహిత్ జోస్యం .. జగన్ వైసీపీని బీజేపీలో కలిపేస్తారట
అలవాటులో పొరబాటుగా తడబడుతున్న గులాబీ నేతలు
ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన నామా నాగేశ్వరరావు తరపున ప్రచారం చేయడానికి సండ్ర వెంకటవీరయ్య రంగంలోకి దిగారు. మొన్నటికి మొన్న నామా నాగేశ్వరరావు టిడిపిని గెలిపించండి సైకిల్ గుర్తుకు ఓటు వేయండి అని అలవాటులో పొరపాటుగా మాట్లాడింది మరిచిపోకముందే మరోమారు సండ్ర వెంకట వీరయ్య సైతం తడబడ్డాడు.
రోడ్ షోలో సైకిల్ గుర్తుకు ఓటు వెయ్యండి అన్న సండ్ర
సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. టిడిపిని గెలిపించండి అంటూ సండ్ర వెంకటవీరయ్య ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పిలుపునిచ్చారు. కల్లూరులో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న సండ్ర వెంకటవీరయ్య నామా నాగేశ్వరరావు ని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేయబోయి పొరపాటుగా సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆ వెంటనే నాలుక కరచుకున్న సండ్ర వెంకట వీరయ్య తప్పు సవరించుకుని కార్ గుర్తుకు ఓటు వేయండి అంటూ కోరారు.
తప్పు దిద్దే యత్నం చేసిన తుమ్మల
ఇక అక్కడే ఉన్న మాజీ మంత్రి తుమ్మల వెంటనే మైక్ తీసుకుని సండ్ర తడబాటును సరిదిద్దే ప్రయత్నం చేశారు. రోడ్ షోలో పాల్గొన్న కార్యకర్తలతోనూ కార్ గుర్తుకు ఓటు వెయ్యాలంటూ నినాదాలు చేయించారు తుమ్మల. ఒకపక్క రేణుకా చౌదరి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే టీఆర్ ఎస్ పార్టీ కోసం ఒకరికి పది మంది ప్రచారం చేస్తున్నా ఏదో ఒక పొరబాటు చేస్తూనే ఉన్నారు.
గులాబీ నేతల గందరగోళం .. ఖమ్మం పోరు ఆసక్తిదాయకం
ఖమ్మం జిల్లాలో ప్రచారం చేసిన తాజా మంత్రివర్యులు ఎర్రబెల్లి, మాజీ మంత్రి తుమ్మల జనాలను గత ఎన్నికల్లో తప్పు చేశారని తిట్టిపోస్తే , ఇక అభ్యర్తి నామా నాగేశ్వరరావు , ఆయన కోసం ప్రచారం చెయ్యటానికి రంగంలోకి దిగిన సండ్ర వెంకట వీరయ్యలు సైకిల్ కి ఓటెయ్యమని , టీడీపీని గెలిపించమని తప్పులు చేస్తున్నారు. మరి ఖమ్మంలో గులాబీ జెండా ఎగరెయ్యాలని ఇంత గందరగోళం పడుతున్న నేతలకు ఖమ్మం ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో అన్నది ఆసక్తిదాయకమే .