తాళిబొట్టు గేటుకు కట్టి .. తన భూమి తన పేర పట్టా చెయ్యాలని తహసీల్దార్ ఆఫీస్ వద్ద మహిళ షాకింగ్ నిరసన
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మహిళ తహసీల్దార్ కార్యాలయం వద్ద వినూత్న నిరసనకు దిగింది. తహసీల్దార్ ఆఫీస్ గేటుకు తాళిబొట్టు కట్టి తన నిరసన వ్యక్తం చేసింది. రుద్రంగి మండలం తహసీల్దార్ కార్యాలయం గేటు వద్ద తన తాళిబొట్టును లంచంగా తీసుకొని తన భూమిని మళ్లీ తన పేరుతో పట్టా చేయాలంటూ మానాల గ్రామానికి చెందిన మంగ ఆందోళన వ్యక్తం చేసింది.
తహసీల్దార్ కార్యాలయం ముందు మానాల గ్రామానికి చెందిన మంగ వినూత్న నిరసన
మానాల గ్రామానికి చెందిన మంగ భర్త పొలాస రాజేశంకు సర్వే నెంబర్ 130/14 లో రెండు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని తన భర్త రాజేశం చనిపోగానే తహసీల్దార్ కార్యాలయం అధికారులు వేరే వారికి పట్టా చేశారని మంగ ఆరోపిస్తుంది. మూడు సంవత్సరాల నుండి తమ భూమిని తన పేరు మీదకి మార్చాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సదరు మహిళ, ఈ రోజు తాళిబొట్టు తెచ్చి, తహసీల్దార్ కార్యాలయం గేటుకు వేలాడదీసి ఆందోళన వ్యక్తం చేసింది.
తన భూమిని అధికారులు వేరొకరికి పట్టా చేశారని.. తాళిబొట్టు ఆఫీస్ గేటు కు కట్టి ఆందోళన
తన భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు తనదగ్గర ఉన్నప్పటికీ తమ భూమిని వేరే వాళ్లకు ఎలా పట్టా చేశారని మంగ ప్రశ్నించింది.ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని తన భూమిని తిరిగి తనకు పట్టా చేయాలని కన్నీటి పర్యంతమైంది.బాధిత మహిళ ఉద్యోగరీత్యా మెట్పల్లి లో పని చేసుకుంటూ ఉండగా వేరే వారు అధికారులతో కుమ్మక్కై తమ భూమి పట్టా చేసుకున్నారని మంగ ఆరోపిస్తోంది. ఈ రోజు తన భర్త ఎలాగూ లేడని, తన భర్త కట్టిన తాళిబొట్టు తీసుకువచ్చి గతంలో ఎవరూ చేయని విధంగా ఆందోళన చేసిన మంగ తనకు జీవనాధారమైన భూమిని ఇప్పించాలని అధికారులను వేడుకుంటుంది.
నిన్న తహసీల్దార్ పై డీజిల్ పోసిన రైతులు , ఇప్పుడు తాలిబొట్టుతో మహిళ ఆవేదన
అనేకసార్లు అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదని ఇలాగైనా అధికారులు తన సమస్యపై దృష్టి సారించాలని సదరు మహిళ తన ఆవేదన వెళ్లగక్కింది. తాళిబొట్టు లంచంగా ఇస్తానని చెప్పింది.నిన్నటికి నిన్న మెదక్ జిల్లాలో రైతులు మాలోతు బాలు అనే రైతు విద్యుత్ షాక్ తగిలి వ్యవసాయ భూమి లో మరణించిన క్రమంలో, అతని భూమికి సంబంధించిన పట్టా ఇవ్వడంలో జాప్యం చేసినందుకు సదరు రైతు బీమా వర్తించకుండా పోయిందని తహసీల్దార్ భానుప్రకాష్ పై డీజిల్ పోశారు.ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా వేరే వారికి పట్టా చేసిన తన భూమిని, తిరిగి తన పేరు మీద చెయ్యాలని రాజన్న సిరిసిల్ల జిల్లా లో మహిళ తాళిబొట్టు తో ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది.