షాకింగ్ చోరీ.. సూర్యాపేటలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు
ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖ ఆస్తులకే రక్షణ లేని పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులే తమ వాహనాన్ని పోగొట్టుకున్న విచిత్ర సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఏకంగా పోలీసు వాహనాన్ని చోరీ చేసిన దొంగలు, సూర్యాపేట జిల్లా పోలీసులకే సవాల్ విసిరారు. ఇంతకు ఏం జరిగిందంటే
సూర్యాపేట జిల్లా కేంద్రంలో దొంగలు పోలీసు వాహనాన్ని చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట పట్టణ రెండవ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసు వాహనాన్ని గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు. కొత్త బస్టాండ్ వద్ద హైవేపై ఉన్న పెట్రోలింగ్ వాహనాన్ని ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని దొంగలు పోలీసులకు షాక్ ఇచ్చారు. TS 09PA 0658 నెంబర్ కల పోలీస్ వాహనంలో వెళ్లి తెల్లవారుజామున విధులు నిర్వహిస్తున్న పోలీసులు బస్టాండ్ వద్ద నిలిపి, ఒక కేసులో వివరాలు సేకరణకు పక్కకు వెళ్లారు .
అక్కడ వాహనానికే తాళంచెవి పెట్టి ఉండటం చూసిన దొంగలు ఈజీగా వాహనాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక వాహనాన్ని దొంగలించిన వారు కోదాడ హుజూర్నగర్ రోడ్లో వాహనాన్ని వదిలిపెట్టి పరారయ్యారు. ఇక వాహనాన్ని కోదాడ వద్ద ట్రేస్ చేసిన పోలీసులు ఎట్టకేలకు వాహనాన్ని కనిపెట్టారు. ఇక వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ కు వాహనాన్ని తరలించారు.
గతంలో కూడా సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ వాహనం చోరీకి గురైంది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ వాహనం చోరీకి గురైంది. దీంతో సూర్యపేట వాసులు పోలీస్ వాహనాలకే భద్రత లేదు, అలాంటప్పుడు మీరు ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు అంటూ పోలీస్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. పోలీసు వాహనాలను ఎత్తుకు పోయేంతగా దొంగలు పెట్రేగి పోతున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. దోపిడీ దొంగలకు చెక్ పెట్టాల్సిన అవసరం పోలీస్ శాఖ పై ఉందని అంటున్నారు.