చంపేస్తాం: వాచ్మన్పై కత్తితో ఇద్దరు మహిళల దాడి, బెదిరింపు
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో వాచ్మన్పై దాడి కేసులో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్న సమయంలో ఇద్దరు మహిళలు రాద్ధాంతం చేశారు. వ్యాన్ ఎక్కకుండా తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు.
ఇద్దరు మహిళలను విచారణ నిమిత్తం అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కాగా, దాడి ఘటనపై మహిళలను మీడియా ప్రశ్నించగా.. 'మీకెందుకు? మేం పోలీసులకు చెప్పుకుంటాం. పోలీసులే చూసుకుంటారు' అని ఓ మహిళ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం గమనార్హం.
కాగా, కూకట్పల్లిలోని సాయిభరద్వాజ అపార్ట్మెంట్లోని 302ఫ్లాట్లో ఈ ఇద్దరు మహిళలు ఉంటున్నారు. వారి ఫ్లాట్ నుంచి రోజూ ఏదో శబ్ధం వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు వాచ్మన్కు ఫిర్యాదు చేశారు. దీంతో అతడు ఓ రోజు రాత్రి ఆ మహిళలుండే ఫ్లాట్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. ఫిర్యాదు గురించి వారికి తెలిపాడు.
అయితే, ఒక్కసారిగా కోపోద్రుక్తులైన మహిళలు అతడ్ని బెదిరింపులకు గురిచేశారు. అతడు పై అంతస్తుకు వెళుతుండగా ఓ మహిళ వెనక నుంచి వచ్చి కత్తితో దాడి చేసింది. చంపుతామంటూ బెదిరింపులకు గురిచేసింది. ఇద్దరు మహిళలు అతడ్ని తోసేయడంతో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు వాచ్మన్.
కాగా, ఈ దాడి మొత్తం అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డైంది. అయితే, సీసీ కెమెరాల్లో ఘటన రికార్డైందని తెలుసుకున్న మహిళలు.. ఆ కెమెరాపై నీళ్లు చల్లడం గమనార్హం. ప్రణాళిక ప్రకారమే వాచ్ మన్ పై దాడి చేశారా? అసలు వీళ్లెం చేస్తున్నారనే విషయం తెలియరాలేదు.
కాగా, దాడి ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదివారం ఆ ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.