సంబరాల వేళ సింగరేణి ఓపెన్ కాస్ట్ లో విషాదం ..భారీ పేలుడుతో నలుగురు మృతి
పెద్దపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో భారీ పేలుడు సంభవించింది. ఒక పక్క తెలంగాణా రాష్ట్రం అవతరణ వేడుకల్లో ఉండగా విషాదం చోటు చేసుకుంది .రామగిరి మండలం ఓపెన్ కాస్ట్-1లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
తెలంగాణా అవతరణ వేడుకలు .. చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు ..ఏమన్నారంటే
మహాలక్ష్మి ఓబీ కంపెనీలో బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఫేజ్ 2 లో బ్లాస్టింగ్ కోసం పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.దీంతో ప్రాజెక్టులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా,పలువురికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన సింగరేణి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన స్థలంలో మరణించిన వారి మృతదేహాలను గోదావరిఖనిలోని సింగరేణి ఆసుపత్రికి అధికారులు తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించారు.
మృతుల్లో ఇద్దరు గోదావరిఖనికి చెందిన రాకేష్ , ప్రవీణ్ గా గుర్తించారు. మరొకరు కమాన్ పూర్ కి చెందిన రాజేష్ గా, ఇంకొకరు రత్నాపూర్ కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఇక కమాన్ పూర్ కు చెందిన వెంకటేష్ రత్నపూర్ కు చెందిన భీమయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు . ఒకపక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో సిరులు కురిపించే సింగరేణి బొగ్గు గనుల్లో జరిగిన భారీ పేలుడుతో నలుగురు మృతిచెందటం, పలువురు గాయపడటం విషాదం.