SIR Notices to Voters : ఓటర్లకు నేటి నుంచి నోటీసులు
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా 'అనామలీస్, అన్-మ్యాపింగ్' విభాగాల కింద గుర్తించిన ఓటర్లకు ఈరోజు నుంచి దశల వారీగా నోటీసులు జారీ కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92.87 లక్షల మంది ఓటర్లు నోటీసులు అందుకోనున్నారు. ఇందులో 60.51 లక్షల మంది 'అనామలీస్'లో విభాగంలో.. మిగతా 32.36 లక్షల మంది 'అన్- మ్యాపింగ్' వర్గంలో ఉన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల వివరాల్లో ఉన్న వ్యత్యాసాలను పరిశీలించి, అర్హులైన వారిని తుది జాబితాలో కొనసాగించనున్నారు. అయితే ఈ నెల 17న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలైనప్పటికీ, మరుసటి రోజే ప్రారంభం కావాల్సిన నోటీసుల పంపిణీ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఈ మేరకు సోమవారం నుంచి బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ)లు ఇంటింటికీ వెళ్లి ఈ నోటీసులను అందజేస్తారు.
అయితే నోటీసులకు నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాల్సిందేనని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. వివరణ ఇవ్వకపోతే ఓటు తొలగించే అవకాశం ఉందని ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు నోటీసుల జారీ కోసం ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేసింది. ఓటరుకు నోటీసు ఇచ్చిన ఫొటోను బీఎల్ ఓలు యాప్ లో అప్ లోడ్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో రోజుకు 200 మందికి వివరణ ఇచ్చేందుకు స్లిప్పుల పంపిణీ జరగనుంది. ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లోని 11 రకాల కార్డుల్లో ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుందని ఈసీ స్పష్టం చేసింది. ఇంటిపేరు, పేర్లలో తప్పులున్న ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్య ఓల్డ్ సిటీలో అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఎక్కువ మంది ఓటర్లకు నోటీసులు అందజేయనున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ మ్యాపింగ్ ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.

అయితే నోటీసులు అందుకున్నంత మాత్రాన ఓటు తొలగిపోతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. నిర్ణీత తేదీల్లో ఓటర్లు అవసరమైన పత్రాలను సమర్పిస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఇక అర్హులైన ఓటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని భరోసా ఇస్తున్నారు. ఇక నోటీసు జాబితాలో ఉన్నారో లేదో ఆన్లైన్ లో తనిఖీ చేసుకునేందుకు ఎన్నికల సంఘం వెబ్ సైట్ voters.eci.gov.in ను సందర్శించొచ్చు.












Click it and Unblock the Notifications