తమ్ముడ్ని, మరదల్ని పైనుంచి తోసేసిన అక్క: మరదలి మృతి
హైదరాబాద్: ఆస్తి కోసం గడ్డి కరవడం మాట అటుంచితే, దాని కోసం ఎంతటి ఘాతుకానికైనా తలపడుతారనే విషయాన్ని హైదరాబాదులో జరిగిన ఓ సంఘటన మరోసారి రుజువు చేసిది. ఆస్తి కోసం అక్కాతమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న వివాదం ఒకరి మృతికి కారణమైంది.
హైదరాబాదులోని గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆ సంఘటన జరిగింది. ఐడిహెచ్ కాలనీలోని ఓ డబుల్ బెడ్రూం ఇంటిలో భార్యాభర్తలైన చందు, జయశ్రీలు నివసిస్తున్నారు. వీరికి మాధురి, సుదీప్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఉమ్మడి ఆస్తి అయిన డబుల్ బెడ్రూం ఇంటి కోసం చందు, అతని సోదరి మీరాబాయిల మధ్య కొంత కాలంగా గొడవ జరుగుతూ ఉంది. సోమవారం రాత్రి మీరా బాయి తన కుటుంబ సభ్యులతో కలిసి చందు ఇంటికి వచ్చింది. మరోసారి ఇరువురి మధ్య గొడవ జరిగింది.
గొడవలో ఆవేశానికి గురైన మీరాబాయి, కుమారుడు చింటూ, కూతురు కీర్తి, అల్లుడ బబ్లూ కలిసి చందు, అతని భార్య జయశ్రీలను బలవంతంగా రెండో అంతస్థు నుంచి కిందికి తోసేశారు. పెద్ద శబ్దం వినిపించడంతో కాలనీవాసులు అక్కడికి చేరుకున్నారు.
తీవ్రంగా గాయపడిన చందు, జయశ్రీలు కింద పడి కనిపించారు. గాయపడినవారిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జయశ్రీ మరణించగా, చందు పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.