Rakhi: హృదయాన్ని కదిలించే ఘటన: చనిపోయిన అన్నయ్య చేతికి రాఖీ కట్టిన చెల్లెలు
పెద్దపల్లి: రాఖీ పండగ రోజు విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంతో ప్రేమతో రాఖీ కట్టేందుకు వచ్చిన సోదరికి.. విగత జీవిగా కనిపించాడు అన్నయ్య. దీంతో గుండెలవిసెలా రోదించింది ఆ చెల్లెలు. చివరకు చనిపోయిన అన్నయ్య చేతికి చివరిసారిగా రాఖీ కట్టింది. ఈ హృదయ విదారక ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
రాఖీ అంటే.. అన్నా చెల్లెల్లు.. అక్కా తమ్ముడి బంధానికి ప్రతీక. హిందూ సంప్రదాయంలో ఈ పండుగకు ప్రత్యేక స్థానముంది. తమ అక్కాచెల్లెళ్లకు భరోసాగా ఉండాలని ప్రతి సోదరుడు ఆరాటం పడుతుటారు. అలాగే తమ సోదరులు ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ తనకెప్పుడు రక్షణగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.

రాఖీ పండగకు ఎప్పుడెప్పుడు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టాలా.. అని చూస్తుంటారు అమ్మాయిలు. అలాగే ఈ చెల్లి కూడా తన అన్నకు రాఖీ కట్టాలని ఎంతో ఆరాటంతో, ఆనందంతో పుట్టింటికి వచ్చింది. చెల్లి రాక కోసం ఎదురుచూసిన అన్న సంతోషంగా ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లాడు. సంతోషంగా ఆమెతో ముచ్చటించాడు. అంతలోనే తిరిగిరాని లోకాలను వెళ్లిపోయాడు. అప్పటివరకు తనతో మాట్లాడిన తన అన్న ఇక లేడని తెలిసి ఆ చెల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య ఎప్పటిలాగే పొలానికి వెళ్లి పొలం పనులు చేస్తుండగా ఒకసారిగా గుండెపోటు రావడంతో పొలం వద్దనే మృతి చెందారు. అయితే ఆయన చెల్లెలు రాఖీ కట్టేందుకు ఒకరోజు ముందే అన్న ఇంటికి వచ్చారు.
అయితే, రాఖీ పండుగకు ఒకరోజు ముందే మంగళవారం.. సోదరుడు కనకయ్య గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలియగానే చెల్లెలు గౌరమ్మ దిగ్భ్రాంతికి గురైంది. గుండెపోటుతో మృతి చెందిన అన్న కనకయ్యకు రాఖీ కట్టి బోరున విలపించింది.
చివరిసారిగా చనిపోయిన అన్నకు రాఖీ కట్టడం పలువురిని కంటతడి పెట్టించింది. గౌరమ్మ.. ప్రతి ఏటా రాఖి పండుగ రోజు వచ్చి.. రాఖి కట్టి వెళ్ళేది. ఈ సారి ముందుగా వచ్చారు. ఎటూ వెళ్లకుండా.. ఇంట్లో ఉండాలని కోరారు. పండుగను ఆనందంగా జరుపుకుందామని అనుకుంటే.. అన్నయ్య మరణంతో ఆ చెల్లెలికి తీరని శోకమిగలడం అక్కడివారిని కలిచివేసింది. కనకయ్య మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications