నిరుద్యోగ మహాదీక్ష వేళ బండి సంజయ్ ఇంటికి సిట్ అధికారులు!!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన వ్యవహారంలో సిట్ అధికారులు ఆధారాలు సమర్పించాలని మరోమారు బండి సంజయ్ కు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ మేరకు సిట్ అధికారులు ఆయన ఇంటికి చేరుకున్నారు.
గతంలో ఈనెల 24వ తేదీన విచారణకు రావాలని బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసిన సిట్, ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో మరోమారు ఆయన ఇంటికి నేరుగా వెళ్లి నోటీసులు ఇస్తున్నారు. బండి సంజయ్ ఒకవైపు టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై నిరుద్యోగ మహాదీక్ష నిర్వహించటానికి సిద్ధం అయిన సమయంలో సిట్ అధికారులు ఆయన ఇంటికి వెళ్ళారు.
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో, బండి సంజయ్ చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని, ఆధారాలు సమర్పించాలని, ఈనెల 24వ తేదీన సిట్ విచారణకు హాజరుకావాలని బండి సంజయ్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిట్ విచారణకు హాజరు కాలేదు.

అంతేకాదు సిట్ కు బండి సంజయ్ ఒక ఆసక్తికరమైన లేఖ కూడా రాశారు. తాను సిట్ ముందు హాజరు కాలేనని, తనకు అసలు సిట్ నోటీసులు అందలేదని పేర్కొన్న బండి సంజయ్, తన వద్ద ఉన్న ఆధారాలను సిట్ అధికారులకు ఇవ్వలేనని స్పష్టం చేశారు.
సిట్ మీద తనకు నమ్మకం లేదని పేర్కొన్నారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని సిట్ అధికారులకు ఇచ్చేది లేదన్నారు. తాను మొదటినుంచి ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. తనకు నమ్మకం ఉన్న సంస్థల ముందే తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఆ హక్కు తనకు ఉందని తెలిపారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తాను హాజరు కాలేనని, ఒకవేళ సిట్ అధికారులు తనను విచారించాలి అనుకుంటే మరొక తేదీని నిర్ణయించాలని బండి సంజయ్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో సిట్ అధికారులు మరోమారు బండి సంజయ్ కు నోటీసులు జారీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications