తుది దశకు నయీం కేసు: 20 రోజుల్లో ముగింపు, బిజీ బిజీగా సిట్ అధికారులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ తుది దశకు చేరుకుందా? అంటే అవుననే అంటున్నారు సిట్ అధికారులు. త్వరలోనే నయీం కేసుని ఓ కొలిక్కి రానుందని సిట్ ఉన్నతాధికారులు తెలిపారు. అంతేకాదు మరో 20 రోజుల్లో నయీం కేసుని ముగించాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇందులో భాగంగా మంగళవారం ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో నయీం కేసుపై సిట్ పర్యవేక్షణ అధికారి అంజనీ కుమార్ బిజీ బిజీగా గడిపారు. ఇప్పటి వరకు నయీం కేసులో నమోదైన 72 కేసులకు గాను చార్జిషీటు దాఖలపై విసృత్తంగా చర్చించారు.
నయీం కేసులో భాగంగా అదుపులోకి తీసుకున్న నిందితులపై స్థానిక కోర్టుల్లోనే చార్జిషీటు దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే నయీం కేసులో వినాయక నిమజ్జనం తర్వాత మరిన్ని అరెస్ట్లకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
గ్యాంగ్ స్టర్ నయీంతో పోలీసులు, రాజకీయ నేతల సంబంధాలపై సిట్ దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. రాబోయే రోజుల్లో నయీం కేసులో మరో 30 మంది వరకు అరెస్ట్లు నమోదయ్యే అవకాశం ఉంది.