ఈతకు వెళ్లిన 6గురు చిన్నారుల మృతి(ఫొటోలు)
కరీంనగర్: సోమవారం ఉదయం ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ఎల్ఎండి జలాశయంలో విగత జీవులుగా బయటపడ్డారు. నగరంలోని సప్తగిరికాలనీకి చెందిన యాచమనేని ప్రతీష్ అలియాస్ గోపి (13), యాచమనేని ప్రద్యుమ్న (10), జోగినిపల్లి శివసాయి (14), దానబోయిన సాయిశ్రీజన్ రెడ్డి (14), బ్యాంక్ కాలనీకి చెందిన జువ్వాడి సౌమిత్ (8), జువ్వాడి సుహిత్ (8) అనే ఆరుగురు విద్యార్థులు జలాశయంలో మునిగి మృతి చెందారు.
ఇందులో ప్రతీష్, ప్రద్యుమ్న అన్నదమ్ములు కాగా, సౌమిత్, సుహిత్ కవలలు. ఈ నలుగురు అక్కాచెల్లెళ్ల పిల్లలు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ప్రతీష్, 6వ తరగతి చదువుతున్న ప్రద్యుమ్న వేసవి సెలవులు గడపడానికి కరీనగర్ సప్తగిరికాలనీలో ఉండే అమ్మమ్మ ఇంటికి వచ్చారు.
అదే విధంగా వీరి చిన్నమ్మ పిల్లలు, కవలలైన ఇక్కడి బ్యాంక్ కాలనీకి చెందిన 3వ తరగతి చదువుతున్న సౌమిత్, సుహిత్ కూడా అమ్మమ్మ ఇంటికి వచ్చారు. వీరంతా రోజూ ఎల్ఎండి జలాశయం చివరన ఖాళీ ప్రదేశంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. ఈ నలుగురితో పాటు ఇదే ప్రాంతానికి చెందిన జోగినిపల్లి శివసాయి (9వ తరగతి), దానబోయిన సాయిశ్రీజన్, బోయినపల్లి రోహన్ (7వ తరగతి) సోమవారం ఉదయం జలాశయం వద్ద క్రికెట్ ఆడారు.
ఆ తర్వాత రోహన్ తప్ప మిగతా ఆరుగురు జలాశయంలో దిగారు. వారికి ఈత సరిగా రాకపోవడంతో ఆరుగురు నీటిలో మునిగి గల్లంతయ్యారు. ఈ విషయాన్ని రోహన్ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. కరీంనగర్ డిఎస్పీ జె.రామారావు, సిఐ నరేందర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గల్లంతైన విద్యార్థులను జాలర్లతో గాలించి బయటకు తీశారు.
అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ హృదాయ విదారక ఘటనతో నాలుగు కుటుంబాలు విషాదంలో మునిగాయి.
సిఎం సంతాపం
ఈ ఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.