తప్పుచేసినందుకు కాదా!: దత్తాత్రేయ అరెస్ట్ వ్యాఖ్యపై స్మృతి ఆశ్చర్యం
ఢిల్లీ/హైదరాబాద్: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హెచ్సియు, జెఎన్యు వివాదంపై బుధవారం, గురువారం పార్లమెంటులో ఉద్వేగంగా మాట్లాడారు. స్మృతి ఇరానీ వాగ్ధాటి పైన చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆమె వేముల రోహిత్ ఆత్మహత్య పైన కూడా లోకసభలో ఘాటుగా స్పందించారు.
ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన రోజు తాను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రేశేఖర రావుకు ఫోన్ చేశానని, శాంతిభద్రతల విషయంలో సహకరించేందుకు ఫోన్ చేశానని ఆమె అన్నారు. కానీ సార్ బిజీగా ఉన్నారని తనకు సమాధానం వచ్చిందని చెప్పారు.
కెసిఆర్ ఫోన్ చేస్తారని తాను భావించానని, కానీ ఆయన చేయలేదని చెప్పారు. ఈ సందర్భంలో టిఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఈ విషయమై సీఎం కెసిఆర్ ఇంటెలిజెన్స్ ఐజీతో మాట్లాడారని, పరిస్థితిని సమీక్షించారని, పదిహేను నిమిషాల తర్వాత ఐజీ తిరిగి ఫోన్ చేశారని చెప్పారు.
అక్కడ చాలామంది గుమికూడి ఉన్నారని, పరిస్థితి అదుపులోకి రావాలంటే కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను అరెస్టద చేయాల్సి ఉంటుందన్నారని, ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి కెసిఆర్ చెప్పారని, అక్కడున్న వారిని నియంత్రించేందుకు బండారు దత్తాత్రేయను అరెస్ట్ చేయాలని తాము ఆదేశించినట్లు చెప్పారు.
జితేందర్ రెడ్డి ప్రకటన పైన ఆమె తనదైనరీతిలో స్పందించారు. ఈ ప్రకటన చాలా విచిత్రంగా ఉందని, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను అరెస్ట్ చేయాలట.. అదికూడా తప్పు చేసినందుకు కాదు.. అక్కడున్న వారిని కంట్రోల్ చేసేందుకు! అని ఆశ్చర్యం స్మృతి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. రోహిత్ వేముల మృతి పైన పార్లమెంటులో స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యల పైన రోహిత్ కుటుంబం స్పందించింది. పార్లమెంటులో కేంద్రమంత్రి స్మృతి అబద్దం చెప్పారని ఆరోపిస్తున్నారు.