వింత: మద్యం మానేయడంతో.. 100మంది మందుబాబులకు అస్వస్థత, ఆస్పత్రిపాలు
ఆదిలాబాద్: అవును ఇది నిజమే. ఆదిలాబాద్ జిల్లా భైంసా పరిధిలోని కామోల్ అనే గ్రామంలో వింత చోటుచేసుకుంది. మద్యపానం శ్రుతిమించితే మంచం పట్టడం చూశాం కానీ, మద్యపానం మానితే కూడా మంచం పట్టడం మాత్రం ఇక్కడే జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ పేరిట గ్రామాల్లోకి చీప్ లిక్కర్ను ప్రవేశపెట్టే విషయంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో దాన్ని విరమించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు గ్రామాలు చీప్ లిక్కరే కాదు, అసలు లిక్కరే మాకొద్దంటూ ఏకంగా తీర్మానాలు చేసేశాయి.
ఇలా సంపూర్ణ మద్యపాన నిషేధం విధించుకున్న గ్రామాల్లో కామోల్ కూడా ఒకటి. మొన్న శ్రీకృష్ణాష్టమి నాడు గ్రామస్తులంతా మద్యపాన నిషేధంపై ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు నుంచే గ్రామంలోని మందుబాబులు అంతా మద్యం మానేశారు.
ఇంకేముంది, నాలుగైదు రోజులు గడిచాయో, లేదో మద్యం మానేసిన మందుబాబుల్లో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారందరూ ఆస్పత్రుల్లో చేరారు. మరునాడు మరో 20 మందికి అస్వస్థత, వీరు కూడా ఆస్పత్రి బాట పట్టక తప్పలేదు.
ఇలా గ్రామంలో వంద మందికి పైగా మందుబాబులు మంచం పట్టడంతో వైద్య సిబ్బంది గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరం స్థాయిని మించి మందుబాబులు అనారోగ్యానికి గురి కావడంతో భైంసా ఆస్పత్రికి వారిని తరలించారు. అక్కడ బెడ్లు చాలక కింద పడుకోబెట్టి మరీ చికిత్స అందిస్తున్నారు.
అసలు మద్యపానం మానేసిన మందుబాబులు అనారోగ్యానికి ఎందుకు గురయ్యారంటే.. ఏళ్లుగా అలవాటున్న మద్యపానాన్ని ఒక్కసారిగా వదిలేయడంతో వారిలో నరాలు పట్టుతప్పాయట. శరీరంలో నీటి శాతం తగ్గిపోయిందట. కాగా, మద్యపానాన్ని ఒక్కసారిగా వదిలేస్తే స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తడం సాధారణమేనని వైద్యులు చెబుతున్నారు.