పివిని సోనియా కించపరిచారు, ఊహించలేదు: మనువడు
హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు మనువడు ఎన్వి సుభాష్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పివి నరసింహారావు 1991లో అధికారంలోకి వచ్చిన సమయంలో ఐదేళ్లకాలం పదవిలో కొనసాగుతారని సోనియాగాంధీ ఊహించలేదని, ఎక్కువలో ఎక్కువగా రెండేళ్లు ఆ పదవిలో ఉంటారని భావించారని ఆయన అన్నారు.
పివిని అన్ని రకాలుగా సోనియా కించపరిచారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పివిని గౌరవించలేకపోయినా, ప్రధాని నరేంద్రమోదీ గౌరవించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఈ నెల 28న పివి నరసింహారావు 95వ జయంతి సందర్భంగా ఢిల్లీలో పివి స్మారక భవనం సిద్ధమవుతోందన్నారు.

కాలం కలిసి వస్తే వచ్చే ఏడాది పివికి 'భారతరత్న'ను కూడా కేంద్రం ఖరారు చేయవచ్చనని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ పివి నరసింహారావుపాలనపై జరిగిన ప్యానెల్ చర్చలో ఆర్థికవేత్త, సీనియర్ పాత్రికేయుడు సంజయ్ బారు, సిబిఐ మాజీ డైరక్టెర్ కె విజయరామారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడారు. పివి మరణించినప్పుడు ఢిల్లీలో దహనసంస్కరాలు జరగాలని సోనియాగాంధీ కోరుకోలేదని చెప్పారు. పివి సంస్కరణల వల్లనే దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. జెఎంఎం ఎంపీల కొనుగోలు కేసులో పివి నరసింహారావు నిర్దోషి అని సిబిఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు అన్నారు.
జెఎంఎం ఎంపీలకు ఏపికి చెందిన కొంతమంది వ్యక్తులు సొమ్ము ఇచ్చారని, ఆ సొమ్మును ఎంపీలు తెలియక బ్యాంకులో డిపాజిట్ చేశారని చెప్పారు. ఎంపీలకు ఎవరు సొమ్ము ఇచ్చారో తెలుసు కాని వెల్లడించనన్నారు. 'దేశాన్ని మార్చి వేసిన పివి పాలన' అనే పుస్తకాన్ని జూలై నెలాఖరులోగా విడుదల చేస్తున్నట్లు సంజయ్ బారు చెప్పారు.












Click it and Unblock the Notifications