కొలువుదీరిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం.. సోనియా గాంధీ కళ్ళలో ఆనందం!!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ఎట్టకేలకు ప్రజలు ఆదరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ ఆనందానికి కారణమయ్యారు. దశాబ్ద కాలంగా అధికారం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి తెలంగాణా రాజకీయ చరిత్ర పుటల్లో స్థానం దక్కించుకున్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎం గా రేవంత్ రెడ్డి తో పాటుగా, డిప్యూటీ సీఎం గా భట్టి విక్రమార్క, మంత్రుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది.

అంతకుముందు సోనియా గాంధీతో కలిసి పూల రథంలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం వేదిక వద్దకు చేరుకున్నారు. వేదికపై ఉన్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు రేవంత్ రెడ్డి ని, సోనియాగాంధీని సాదరంగా వేదికపైకి స్వాగతించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సీఎంగా రేవంత్ రెడ్డి తో పాటు, రేవంత్ మంత్రి వర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుతానని, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయగా, అనంతరం డిప్యూటీ సీఎంగా దామోదర రాజనర్సింహతో పాటు మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రమాణం చేశారు.
ఈ మొత్తం వేడుకను కళ్ళారా చూసిన సోనియాగాంధీ సంతోషంగా కనిపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు ఇన్నాళ్లకు ప్రతిఫలం దక్కింది అన్నట్టుగా సోనియాగాంధీ కళ్ళల్లో ఆనందం కనిపించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం ఈ మహోత్సవంలో సంతోషంగా కనిపించారు. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరింది.












Click it and Unblock the Notifications