తెలుగు హీరోలకు సోనూసూద్ రోల్ మోడల్.!కరోనా పట్ల టీ సర్కార్ చేతులెత్తేసిందన్న సీఎల్పీ నేత భట్టి.!
హైదరాబాద్ : సోనూసూద్ మాదిరిగా తెలుగు సినిమా హీరోలు, హీరోయిన్లతో పాటు ఇతర ఆర్టిస్టులు, పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి కరోనా బాధితులకు అండగా నిలవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇక వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎటువంటి నిర్దిష్టమైన కార్యాచరణ తీసుకోలేదని ఘాటు విమర్శలు చేసారు. రాష్ట్ర జనాభా ఎంత? కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్ డోసులు ఎన్ని? ఫార్మా సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్ ఎంత? అనే దానిపై ప్రభుత్వం వద్ద స్సష్టత లేదని భట్టి మండిపడ్డారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న చీఫ్ సెక్రెటరీ కూడా ఈ వివరాలు చెప్పలేకపోవడం శోచనీయమన్నారు భట్టి.
టీ సర్కార్ కోమాలో ఉంది.. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్న సీఎల్పీ నేత భట్టి..
కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విపలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. పాతాలభైరవి సినిమాలోలాగా అప్పుడప్పడూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ నుంచి బయటకువస్తారని వ్యగ్యంగా విమర్శించారు. కల్వకుంట్ల తారక రామారావు టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ గా వచ్చాక కరోనా వ్యాక్సిన్ రాష్ట్రంలో పూర్తిగా నిలిచిపోయిందని భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్పొరేట్, ప్రయివేట్ ఆసుపత్రుల కరోనా రోగుల నుంచి వసూలు చేస్తున్న భరించలేని ఫీజులను నియంత్రించేందుకు సీనియర్ ఐఏఎస్ ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని గత బడ్జెట్ సమావేశాల్లోనే ముఖ్యమంత్రికి చెప్పినా పట్టించుకోలేదని భట్టి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారు.. టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ వచ్చాక రెండో డోస్ కూడా నిలిచిపోయిందన్న కాంగ్రెస్..
కరోనా మొదటి దశకు, రెండవ దశకు ఏడాది సమయం ఉన్నా రాష్ట్రంలో కనీసం ఆక్సిజన్ ప్లాంట్ లను కూడా ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఎక్కడ ఉందో, ఏ ఆసుపత్రిని పరిశీలించిందో? ఎక్కడ ఫీజులు నియంత్రణ చేసిందో ఇప్పటివరకూ తెలియలేదని అన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందన్నారు. జరుగుతున్న పరిణామాల మీద మంత్రులెవరూ స్పందించడం లేదని, కనీసం బ్యూరోక్రసీతో పనిచేయించడానికి కూడా సీఎస్ చొరవ చూపించడం లేదని భట్టి ఆవేదన వ్యక్తం చేసారు.
సీఎస్ కు సీరియస్ నెస్ లేదు.. కరోనా కట్టడిలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందన్న భట్టి..
ప్రభుత్వ పరంగా సీఎస్ కూడా పూర్తిగా విఫలం చెందారని భట్టి ఆరోపించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో సీఎస్ గా తన బాద్యతలను నిర్వహించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసారు. చీఫ్ సెక్రెటరీ లాక్డౌన్ ద్వారా ఉపయోగం లేదన్న మూడు రోజులకే కేబినెట్ లో లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రకటించారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలు తీవ్రంగా అయోమయానికి గురవుతున్నారని భట్టి అన్నారు. కరోనాపై పూర్తి స్థాయిలో ఒక మంత్రి పర్యవేక్షణ ఉండాలికానీ, గెస్ట్ యాక్టర్లలా రోజుకొకరు సమావేశాలు పెట్టడం ఏంటని భట్టి సూటిగా ప్రశ్నించారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించాలి.. ప్రజల ప్రాణాలను కాపాడాలన్న సీఎల్సీ నేత..
రాష్ట్రంలో 18 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేస్తున్నామని ప్రకటించినప్పటికి, క్షేత్ర స్థాయిలో ఆ దిశగా అడుగులు పడడంలేదని భట్టి విమర్శించారు. రెండో డోస్ సంగతి దేవుడెరుగు మొదటి డోస్ వాళ్లకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం లేదని భట్టి విస్మయాన్ని వ్యక్తం చేశారు. డ్యూ డేట్ పూర్తవుతున్నా రెండో డోస్ వారికి వ్యాక్సిన్ ఇవ్వడం లేదన్నారు. కరోనా విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో వ్యాక్సినేషన్ ఇవ్వద్దనే ఆదేశాలు జారీ చేయడం అత్యంత దారుణమని భట్టి అన్నారు. ఇంత ముందు చూపు లేని ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని భట్టి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ తయారీ విషయమై రెండు ఫార్మసీ కంపెనీలతో టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ కేటీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ సమావేశ వివరాలను ఇప్పటివరకూ వెల్లడించలేదని భట్టి స్పష్టం చేసారు.